సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే
న్యూఢిల్లీ: భారత్లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది.
వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సరోగసిని భారతీయులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు కాదని స్పష్టం చేసింది.
మానవ పిండాల దిగుమతిపై కూడా నిషేధం విధించనుంది. కేవలం పరీక్షల కోసమే వీటిని అనుమతిస్తారు. అద్దె గర్భాల వ్యాపారం, మానవ పిండాల దిగుమతికి భారత్ మూల కేంద్రమైంది. పరీక్షల కోసమంటూ మానవ పిండాలను దిగుమతి చేసుకుంటున్న కొందరు వైద్యులు చట్టవ్యతిరేకంగా సరోగసిని ప్రోత్సహిస్తున్నారు.
సంతానం కోసం విదేశీయులు భారత్కు క్యూకట్టడంతో అద్దె గర్భం వ్యాపారమయంగా మారింది. దీనిపై స్పందించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి రెండు వారాల కిందట సూచించి, అక్టోబర్ 28 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం ఈమేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.