ఇదీ పాకిస్తాన్: మోడీ నిప్పులు, బంగ్లా-భారత్ మధ్య 22 ఒప్పందాలు
భారత్ - బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షేక్ హసీనాలు శనివారం ఇరు దేశాల మధ్య కొత్త రైలు, బస్సు రవాణాను ప్రారంభించారు.
న్యూఢిల్లీ: భారత్ - బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షేక్ హసీనాలు శనివారం ఇరు దేశాల మధ్య కొత్త రైలు, బస్సు రవాణాను ప్రారంభించారు. కోల్కతా నుంచి ఖుల్నాకు మైత్రీ ఎక్స్ప్రెస్ రైలును, కోల్కతా నుంచి ఖుల్నా మీదుగా డాకాకు బస్సును కొత్తగా ఆవిష్కరించారు.
ఉత్తర బెంగాలులోని రాధికాపూర్ నుంచి అసోంలోని చమురు శుద్ధి కర్మాగారానికి బంగ్లాదేశ్ మీదుగా సరుకు రవాణా మార్గాన్ని ప్రారంభించారు. ఇది దశాబ్దాలుగా మూతబడి ఉంది. అంతకు ముందు ఇద్దరి సమక్షంలో ఇరు దేశాల మధ్య 22 ఒప్పందాలు కుదిరాయి. తీస్తా నది జలాల మీద మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
ఉగ్రవాదంపై..
ఉగ్రవాదానికి వూతమిస్తున్న పాకిస్థాన్ను ప్రధానమంత్రి మోడీ మరోసారి గట్టిగా దునుమాడారు. నేరుగా పేరెత్తకుండానే అది చేస్తున్న ఉగ్ర నిర్వాకాలను కడిగేశారు. ఆ వైఖరిని వీడితేనే తమ స్నేహబంధం వికసిస్తుందని స్పష్టం చేశారు. విశ్వాసం కంటే వెన్నుపోటు పైనే పొరుగుదేశానికి మక్కువ అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో '1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ' పోరాట వీరుల కుటుంబాలను ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సత్కరించారు. అనంతరం మోడీ ప్రసంగించారు. సహకారానికి భారత్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ, దీని కోసం పాకిస్థాన్ ముందుగా ఉగ్రవాదానికి దూరంగా నిలవాలని స్పష్టం చేశారు.
భారత్ కూడా బాధితురాలు..
దక్షిణాసియాలో ఉగ్రవాదానికి పురిటిగడ్డ పాకిస్తాన్ అని, దానిని ఆ దేశం ప్రోత్సహిస్తోందని, ఆ దేశ ఉగ్రవాద ఆలోచన ధోరణే ఈ ప్రాంతంలో శాంతికి ప్రధాన అడ్డంకి అని, అభివృద్ధి కంటే విధ్వంసాన్నే అది కోరుకుంటోందని, నమ్మకంపై వెన్నుపోటు పొడుస్తోందని, ఆ దేశ ధోరణి వల్ల భారత్ కూడా బాధితురాలయిందని మోడీ అన్నారు. ప్రతీ దేశానికి తాము స్నేహ హస్తాన్నే చాచామనీ, యావత్ ప్రాంతానికీ మంచి జరగాలనే ఆకాంక్షించామనీ మోడీ చెప్పారు. బంగ్లాదేశ్ విమోచనలో భారత సైన్యం పోషించిన పాత్రను ఎన్నడూ మరిచిపోలేమన్నారు.
హసీనాకు ప్రశంసలు
హసీనాపై మోడీ ప్రత్యేకంగా మాట్లాడి ప్రశంసలు కురిపించారు. కుటుంబంలో 16 మంది హత్యలకు గురైనా బంగ్లాదేశ్ కోసం హసీనా పోరాడి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. శిలలా దృఢంగా ఆమె నిలిచి తన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కష్టపడుతున్నారన్నారు. ఆమె ధైర్యాన్ని నేను కొనియాడుతున్నానని, ఇంతటి ధీశాలులు చాలా కొద్దిమందే ఉంటారని చెప్పారు.
భారత మృతవీరుల రక్తంతో
భారత మృతవీరుల రక్తంతో బంగ్లాదేశ్ తన చరిత్రను లిఖించుకొందని షేక్ హసీనా అన్నారు. 1971లో హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ను పాక్ సైనికుల ఖైదు నుంచి విడిపించిన అప్పటి మేజర్ అశోక్తారాను ఇద్దరు ప్రధానులు కలిసి ఫోటో దిగారని హసీనా చెప్పారు.
హసీనాను కలిసిన మమత
రాష్ట్రపతి భవన్లో బస చేసిన హసీనాను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విడిగా కలుసుకున్నారు. తీస్తా నదీ జలాలను పంచుకోవడంలో ఉన్న ఇబ్బందుల్ని వివరించారు. కోల్కతా రావాల్సిందిగా హసీనాను ఆహ్వానించారు.
దాదాపు
ఏడేళ్లుగా
కొలిక్కిరాకుండా
మిగిలిపోయిన
తీస్తా
జలాల
పంపకానికి
సత్వర
పరిష్కారం
చూపిస్తామనీ,
ఇది
భావోద్వేగాలతో
ముడిపడిన
అంశమని
ప్రధాని
మోడీ
చెప్పారు.
మమత మద్దతుపై మోడీ
భారత్లో పర్యటన నిమిత్తం వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో హైదరాబాద్ హౌస్లో శనివారం మోడీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒప్పందానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మద్దతు లభిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. విభిన్న అంశాలపై ఇరువురు ప్రధానులు విస్తృతంగా చర్చించుకున్నారు. 22 ఒప్పందాలపై సంతకాలు చేశారు.
భారత్ సాయం
అనంతరం సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. బంగ్లాదేశ్లో ప్రాజెక్టుల అమలుకు విడతల వారీగా 4.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30,600 కోట్లు) రుణంగా సమకూరుస్తామని మోడీ ప్రకటించారు. ఇది కాకుండా సైనిక అవసరాల నిమిత్తం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3400 కోట్లు) అదనపు రుణంగా ఇచ్చేందుకు సంసిద్ధత ప్రకటించారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ఉగ్రవాద విస్తరణ రెండు దేశాలకే కాకుండా ఈ ప్రాంతానికంతటికీ తీవ్ర ముప్పేనని మోడీ పేర్కొన్నారు. భారత్తో సరిహద్దు వెంబడి శాంతి, రక్షణల కోసం అన్ని చర్యలూ తీసుకుంటామనీ, ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదని హసీనా చెప్పారు.