ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమను ప్రారంభించిన మోడీ
Recommended Video
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జై సంయుక్తంగా ప్రారంభించారు. దక్షిణకొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్సంగ్ నోయిడాలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఏటా 120 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చెయ్యాలని శామ్సంగ్ భావిస్తోంది.
నోయిడా ప్రాంతంలోని దాదాపు 35 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 5వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీగా ఇది నిలిచింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్గా భారత్ అవతరించిందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాగా, 2007 నుంచి శాంసంగ్ తన ఫోన్లను ఇండియాలో అసెంబుల్ చేస్తుండగా ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఫోన్లను ఇక్కడే తయారు చేయవచ్చు. దీని వల్ల ఫోన్లను చాలా తక్కువ ధరలకే వినియోగదారులు పొందవచ్చు.
ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అనేక కంపెనీలు ఇప్పటికే భారత్లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. త్వరలో మరిన్ని కంపెనీలు పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి.