ఇదీ వివక్షే?: లైంగిక వేధింపుల్లో బాధితులు బాలురైతే?.. నిండా నిర్లక్ష్యం..
న్యూఢిల్లీ: దేశంలో లైంగిక వేధింపులకు గురయ్యే బాలుర పట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడుతున్నవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని సవరించిన కొద్దిరోజులకే.. మైనర్ బాలుర విషయంలో ప్రభుత్వం తనకు తానుగా విమర్శ చేసుకోవడం గమనార్హం.
'చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురవుతున్నవారిలో బాలురే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పరిహారంతో పాటు వారి అవసరాలను గుర్తించడంలో అలసత్వ వైఖరి కనిపినిస్తోంది.' మహిళా శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమస్య గురించి వివరిస్తూ రాష్ట్రాలకు లేఖలు కూడా పంపించింది.
నిజానికి కేంద్రం పర్యవేక్షణలో రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల ద్వారా అత్యాచార బాధితులకు, లైంగిక వేధింపుల బాధితులకు, ఇతర నేరాల్లో బాధితులుగా మిగిలినవారికి పరిహారం అందాల్సి ఉంటుంది. అయితే బాధితులు బాలురు అయినప్పుడు మాత్రం వారికి తగిన రీతిలో పరిహారం అందడం లేదు. ఆర్థిక సహాయానికి తోడు మరే సహాయం వారికి అందడం లేదు.
అసలు చాలా సందర్భాల్లో బాలురు లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి రానివ్వకుండా చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. 2007లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 12,447మంది చిన్నారి బాలురు స్కూళ్లలోనో, ఇంట్లోనో, వీధుల్లోనో లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు తేలింది. ఇందులో 53శాతం మంది బాధితులుగా మిగిలిపోయారు.
12ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డవారికి ఉరిశిక్షలు విధించే చట్టాన్ని ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో బాలురపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనను కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందంటున్నారు. అప్పుడే లింగ వివక్షకు తావు లేకుండా ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు సెషన్ లో దీనిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.