భారత్కు ఆర్థిక పునర్వైభవం: మోడీ, రోడ్మ్యాప్ రెడీ
న్యూఢిల్లీ: భారతదేశం మరోసారి ప్రపంచ ఆర్థిక దిగ్గజంగా ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇందుకోసం దేశంలోని 125 కోట్ల ప్రజల శక్తి సామర్థ్యాలను సరైన మార్గంలో పెట్టడానికి తనవద్ద రోడ్మ్యాప్ సిద్ధంగా ఉందని మోడీ చెప్పారు. ‘ఒకప్పుడు స్వర్ణకాంతులీనే దేశంగా అభివర్ణించిన దేశం ఇది. ఆ స్థాయినుంచి మేము పడిపోయాం. అయితే మళ్లీ పునరుత్థానం చెందడానికి మాకు బోలెడన్ని అవకాశాలున్నాయి' అని అన్నారు.
‘గత ఐదు, పది దశాబ్దాల చరిత్రను చూసినట్లయితే భారత్, చైనాలు సమానవేగంతో అభివృద్ధి చెందుతుండడాన్ని గమనిస్తారు. ప్రపంచ జిడిపిలో వాటి వాటా సమాంతరంగా పెరిగింది. అలాగే సమాంతంరంగా పతనమైంది. ఈ శకం ఆసియాదే' అని మోడీ అన్నారు. భారత్, చైనాలు కలిసికట్టుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి' అని అమెరికాకు చెందిన సిఎన్ఎస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ చెప్పారు. భారతదేశం ఏ దేశంలాగా తయారు కావాల్సిన అవసరం లేదని, భారత్లాగా మాత్రమే తయారుకావాలని మరో ప్రశ్నకు సమాధానంగా మోడీ చెప్పారు.
125 కోట్ల భారతీయుల శక్తి సామర్థ్యాలపై తనకు అపారమైన విశ్వాసం ఉందని అంటూ, ఈ శక్తి సామర్థ్యాలను సరైన మార్గంలో వినియోగించుకోవడానికి తన వద్ద స్పష్టమైన రోడ్మ్యాప్ ఉందని మోడీ చెప్పారు. చైనా తరహా నిరంకుశ అధికారాలను మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? అని ప్రశ్నించగా, ప్రజాస్వామ్య దేశాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయని, అదే గనుక లేకపోతే తనలాంటి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రధాని పదవిలో కూర్చుని ఉండేవాడు కాదని మోడీ అన్నారు.
దేశంలో మహిళలపై వివక్ష, హింస పెరుగుతున్నాయి. దీనిపై మీరేం చేయాలనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘దీనికి మూలకారణంపై రాజకీయ పండితుల వ్యాఖ్యలతో మరింత నష్టం జరుగుతోంది. మహిళల గౌరవాన్ని కాపాడటం మా సమష్టి బాధ్యత. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అలాగే, (మా దేశంలో) శాంతిభద్రతల పరిస్థితులు ఏమీ క్షీణించలేదు. మహిళలను గౌరవిస్తూ, వారిని సమానంగా చూసే కుటుంబ సంప్రదాయాన్ని మేం పునరుద్ధరించాల్సి ఉంది. ఇందుకు అవసరమైనది.. బాలికా విద్య. దీనివల్ల మహిళాసాధికారత పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న ‘బాలికలకు విద్య నేర్పించు.. బాలికలను రక్షించు' అనే ఉద్యమం చేపట్టింది' అని మోడీ చెప్పారు.
మీరు ఎలా విశ్రాంతి పొందుతారు? మీరు పనిచేయనప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ‘పనిచేయని' తరహా వ్యక్తిని కాదు. పనిలోనే నేను ఆనందాన్ని పొందుతాను. పనే నాకు విశ్రాంతినీ ఇస్తుంది. ప్రతీక్షణం నేను కొత్త విషయాల గురించి ఆలోచిస్తాను. ఉదాహరణకు.. ఒక కొత్త ప్రణాళిక వేయడం, పని చేయడానికి కొత్త దారులు వెతకడం.. ఇలా. ఒక శాస్త్రవేత్త ఎలా తన ప్రయోగశాలలోనే గంటలతరబడి గడుపుతూ ఆనందాన్ని పొందుతాడో.. నేనూ అలాగే పరిపాలనలోనూ కొత్త పనులు చేయడంలోనూ ప్రజలను ఏకం చేయడంలోనూ ఆనందాన్ని పొందుతాను. ఆ ఆనందం నాకు చాలు.
మీరు ధ్యానం చేస్తారా? యోగా చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘చిన్నవయసులోనే యోగా, ప్రాణాయామం ప్రపంచానికి పరిచయం కావడం నా అదృష్టం. అవి నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ వీటిని తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని నేనెప్పుడూ సూచిస్తుంటాను' అని చెప్పారు. మీరు యోగా వల్ల ప్రయోజనాల గురించి ఒక సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. వాటిని మీరెలా చూస్తారు? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘శరీరం ఒక పని చేస్తుంటే.. మెదడు ఇంకేదో ఆలోచిస్తుండటం మనం చాలాసార్లు గమనిస్తాం. కానీ, యోగా హృదయాన్ని, మనసును, శరీరాన్నీ అనుసంధానిస్తుంది' అని చెప్పారు.
ఒకటి, రెండేళ్ల తర్వాత దేశ ప్రజలకు మీరు సాధిచిన విజయాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారని అడగ్గా, వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడూ దెబ్బ తీయకూడదని ఆయన అన్నారు. ‘దేశ ప్రజలకు వ్యవస్థపట్ల అపారమై విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బ తీయకూడదు. ఉపన్యాసాల ద్వారాకాక నా చర్యల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగితే అప్పుడు ఈ దేశంలోని 125 కోట్ల ప్రజలు సంఘటితంగా ముందుకు వస్తారు. దేశాన్ని సుసంపన్నం చేస్తారు' అని ప్రధాని మోడీ అన్నారు