పాకిస్తాన్తో యుద్ధం తప్ప.. మరో ఆప్షన్ లేదు: ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగబడటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి ముగింపు పలకపోతే పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు.
శనివారం తెల్లవారుజామున సంజ్వాన్లోని ఆర్మీ శిబిరంపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, మరో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.
పాకిస్తాన్ ప్రతిరోజూ జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులకు పాల్పడుతోందని, భారత్పై పాక్ ఉగ్రవాదులు దాడులు చేయని రోజే లేదంటూ ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించడం, వారికి ఆశ్రయం కల్పిస్తూ భారత్పై దాడులు ఇలాగే కొనసాగిస్తే పాకిస్తాన్పై యుద్ధం చేయడం తప్ప మనకు మరో ఆప్షన్ లేదన్నారు.
భారత్ నుంచి శాంతిని మాత్రమే కోరుకునేటట్లయితే పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాదానికి ముగింపు పలకాలని, లేనిపక్షంలో భారత్ నుంచి యుద్ధమే సమాధానం అవుతుందని హెచ్చరించారు. భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే పాక్ తన వైఖరిని మార్చుకోవాలన్నారు.
అసలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరంగా ఉండటమే మంచిదని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. నిజానికి యుద్ధం వల్ల రెండు దేశాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అయితే పాకిస్తాన్ చర్యలు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల నడుమ యుద్ధ వాతావరణం ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.