విమానం మొదలు విమాన వాహకనౌక వరకు.. ప్రపంచంలో భారత్ ఇప్పుడో ప్రధాన శక్తి.. : మోదీ
Recommended Video
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగమిస్తోందని.. ప్రస్తుత ప్రపంచంలో ప్రతీది స్వశక్తితో తయారుచేసుకోగల దేశాల్లో భారత్ ఒకటి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విమానం మొదలు విమాన వాహక నౌక వరకు సొంతంగా రూపొందించుకునే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయన్నారు. డీఆర్డీవోకి చెందిన ఐదు అత్యాధునిక ల్యాబ్స్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అవి అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. ఈ ఐదింటిని జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.బెంగళూరులో డిఫెన్స్ రీసెర్చ్&డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO)ఆధ్వర్యంలో ఏర్పాటైన యంగ్ సైంటిస్ట్ ల్యాబోరేటరీ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడారు.
దమ్ముంటే ఆ పనిచేయండి.. ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్..
శాస్త్రవేత్తలు,ఆవిష్కర్తలను వారి ప్రతీ అడుగులో వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఒక ప్రధానిగా ఈ విషయాన్ని చెబుతున్నానని మోదీ అన్నారు. శాస్త్రవేత్తలు తమ సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేయాలని, ప్రభుత్వం వారికి పూర్తి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. సామర్థ్యానికి సంబంధించిన పారామీటర్స్ను మార్చుకోవాలని, విస్తృతమైన అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు సాధ్యమైనంత మేర కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ వ్యూహాత్మక అంశాలను గగనతలం,సముద్రం,సైబర్,అంతరిక్షం నిర్ణయిస్తాయన్న సంగతి శాస్త్రవేత్తలకు తెలుసునని మోదీ వ్యాఖ్యానించారు. వీటితో పాటు రక్షణ రంగంలో ఇంటలిజెంట్ మెషీన్స్ కీలక పాత్ర పోషించే రోజులు వస్తాయని,ఆ విషయంలో ఇండియా వెనుకబడవద్దని అన్నారు. దేశ పౌరుల భద్రత,సరిహద్దులు,జాతీయ ప్రయోజనాల రీత్యా భవిష్యత్తులో సాంకేతిక మరియు ఆవిష్కరణల రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు డీఆర్డీవో సంస్థ బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లలో యంగ్ సైంటిస్ట్ ల్యాబోరేటరీలను ఏర్పాటు చేసింది.