భద్రతా దళాల గొప్ప విజయం.. సజీవంగా పట్టుబడిన మరో కసబ్!
భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ అమిర్ సజీవంగా పట్టుబడ్డాడు. ఈ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు.
న్యూఢిల్లీ : భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ అమిర్ సజీవంగా పట్టుబడ్డాడు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులు చేయాలని లష్కరే తొయిబా కుట్ర పన్నుతోందని ఈ ఉగ్రవాది చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఇతని బృందంలో నలుగురైదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అమిర్ పాకిస్తాన్లోని ముల్తాన్ ప్రాంతానికి చెందినవాడు.
ఈనెల 24న జమ్మూ కశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇతనిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని జమ్మూ-కశ్మీరులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు నిర్వహించడమే లక్ష్యంగా లష్కరే తొయిబా కుట్ర పన్నుతోందని అమిర్ వెల్లడించినట్లు సమాచారం.
లష్కరే తొయిబా ఉగ్రవాది, అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇటీవలే పాకిస్తాన్లో గృహ నిర్బంధం నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే అతను మాట్లాడుతూ భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోరాదని భద్రతా నిపుణులు చెబుతున్నారు.