సరిహద్దులో చైనా కిరాతకం గుర్తుందా? గొర్రెలమంద, పొగమంచు మాటున కాల్పులు.. మళ్లీ ఇన్నాళ్లకు మరణాలు..
భారత్-చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత చివరికి రక్తపాతానికి దారితీసింది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో రెండు వర్గాలు రక్తాలొచ్చేలా కొట్టుకున్నాయి. ఈ ఘర్షణలో మనవైపు ఓ కల్నల్ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, చైనా వైపు కూడా కనీసం ఐదుగురు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. సరిహద్దు వివాదాల పరిష్కారంలో భారత్ సూచించిన శాంతి మార్గాన్నే అనుసరిస్తామన్న చైనా.. తాజా ఘటనతో మరోసారి తన ద్వంద్వ నీతిని బయటపెట్టుకుంది. 1975 తర్వాత ఎల్ఏసీలో గొడవల కారణంగా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి.
చైనా బరితెగింపు.. 45 ఏళ్ల శాంతి బద్దలు.. ఆర్మీ బలగాల హత్యలపై బుకాయింపు.. ఇండియాదే తప్పంటూ..
ఆ రెండు సందర్భాల్లోనూ..
భారత్ చైనా 1962లో నేరుగా యుద్ధంలో తలపడటం తెలిసిందే. యుద్ధం తర్వాత ఒప్పందాల్లో భాగంగా కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. అయితే ముఖాముఖి యుద్ధం తర్వాత రెండు సందర్భాల్లో 1967, 1975లో చైనా మనల్ని దొంగదెబ్బ తీసింది. ఆ రెండు సందర్భాల్లోనూ డ్రాగన్ కిరాతకంగా వ్యవహరించింది. 1975 తర్వాత ఒకరి చేతిలో మరొకరు చనిపోయిన సందర్భాలు లేవనుకుంటుండగానే.. శాంతి ఒప్పందాలకు విఘాతం కలిగేలా సోమవారం నాటి సంఘటన చోటుచేసుకుంది.
గొర్రెల మంద పేరుతో..
ముఖాముఖి యుద్ధం కాకుండా చైనా కిరాతకానికి పాల్పడిన 1967 ఘటన.. సిక్కిం సరిహద్దులో చోటుచేసుకుంది. 1950 నాటికే భూటాన్ ను కబళించిన చైనా.. ఆ తర్వాత సిక్కింపైనా కన్నేసింది. అప్పటి స్వతంత్ర్య రాజ్యం సిక్కింకు భారత్ సైనిక సహకారాన్ని అందించడంతో చైనా దూకుడుకు బ్రేక్ పడింది. దీంతో డ్రాగన్ దొంగదారిని ఎంచుకుంది. చైనాకు చెందిన గొర్రెల మందను భారత జవాన్లు దొంగిలించారని ఆరోపిస్తూ కయ్యానికి దిగింది. గొడవను క్రమంగా పెద్దది చేస్తూ.. ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దు వద్ద భారీ కందకాలు తొవ్వడం ప్రారంభించింది. దీనికి ప్రతిగా భారత్.. సరిహద్దులోని నాథూలా నుంచి సేబూలా ప్రాంతంలో ఇనుప కంచె నిర్మాణాన్ని చేపట్టింది..
వందల మంది చనిపోయారు..
నాథూలా ప్రాంతంలో భారత్ ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో చైనా.. 1967, సెప్టెంబర్ 11న కాల్పులు మొదలుపెట్టింది. నాలుగు రోజులపాటు నిర్విరామంగా కొనసాగిన కాల్పుల్లో రెండువైపులా ప్రాణనష్టం జరిగింది. సెప్టెంబర్ 14న తాత్కాలిక శాంతి నెలకొనడంతో మృతదేహాల అప్పగింత ప్రక్రియ సజావుగా ముగిసింది. కానీ 15 రోజులు తిరిగేలోపే.. అంటే అక్టోబర్ 1న చైనా మళ్లీ దొంగదెబ్బకు సిద్ధపడింది. ఈసారి చోలా ప్రాంతంలో కాల్పులకు తెగబడగా.. భారత్ కూడా గట్టిగానే తిప్పికొట్టింది. నాటి వరుస ఘటనల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన 80 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చైనా వైపు 300 నుంచి 400 మంది సైనికులు హతమైనట్లు అంచనాలున్నాయి. మళ్లీ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత..
1975లో చివరిసారి..
భారత్ చైనా మధ్య చివరిగా 1975లో కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఇది గతంలో జరిగిన ఘటనలకు పూర్తి విరుద్ధం. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో లోని తులుంగ్ లా ప్రాంతంలో గస్తీకాస్తోన్న నలుగురు భారత సైనికులనుచైనా హతమార్చింది. దట్టమైన పొగమంచు కారణంగా గస్తీ బృందం పొరపాటున దారి తప్పగా.. దాన్ని అవకాశంగా తీసుకుని చైనా కాల్పులకు పాల్పడింది. అయితే పొగమంచును అడ్డంపెట్టుకుని.. చైనా ఉద్దేశపూర్వకంగానే భారత బలగాలపై అంబుష్ నిర్వహించిందనే వాదన కూడా రికార్డుల్లో నమోదైంది. ఇలా వీలైనప్పుడల్లా భారత్ ను దొంగ దెబ్బ తీస్తోన్న చైనా తాజాగా లదాక్ ప్రాంతంలో రక్తపాతానికి కారణమైంది.