India-China border: సైనికుడి ఇంట్లో 15 రోజుల క్రితం శుభకార్యం, ఒక్కసారి కూడా, పాపం !
చెన్నై/ న్యూఢిల్లీ: లడక్ లోయలో భారత్- చైనా ఆర్మీల మధ్య జరిగిన దాడుల్లో తమిళనాడులోని రామనాథపురంకు చెందిన సైనికుడు పళని అమరుడయ్యాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నోకలలు కని నిర్మించిన కొత్త ఇంటిలో ఒక్కసారి కూడా అడుగుపెట్టకుండా పళని వీరమరణం పొందడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు. పిల్లలను బాగా చదివించుకోవాలని ఆశతో సొంత ఊరికి 65 కిలో మీటర్ల దూరంలో నిర్మించిన ఇంటి గృహప్రవేశం 15 రోజుల క్రితమే జరిగింది. గత 22 ఏళ్లుగా దేశ సేవకు అంకితం అయిన పళని వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడాడు. తాను ఫోన్ చేసే వరకు మీరు ఎవ్వరూ తనకు ఫోన్ చెయ్యకూడదని చెప్పి చివరికి ఎవ్వరికి అందకుండా వెళ్లిపోయారని పళని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త
22 ఏళ్లుగా పళని దేశసేవ
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని కడకలుగు గ్రామంలో నివాసం ఉంటున్న కాళిముత్తు కుమారుడు పళని గత 22 ఏళ్ల నుంచి భారత సైన్యంలో పని చేస్తూ దేశ సేవ చేస్తున్నాడు. సైనికుడు పళనికి భార్య వానతీ దేవి ప్రసన్న (10) అనే కుమారుడు, దివ్యా (8) అనే కుమార్తె ఉన్నారు. అన్న పళనిని ఆదర్శంగా తీసుకున్న ఆయన తమ్ముడు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తున్నాడు. దక్షిణ తమిళనాడులో సైన్యంలో చేరిన యువకుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
నా పిల్లలు బాగా చదువుకోవాలి
తన ఇద్దరు పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని పళని ఎన్నో కలలు కన్నాడు. సొంత గ్రామంలో ఉంటే పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురౌతాయని ఆలోచించిన పళని రామనాథపురం పట్టణంలో ఓ ఇంటి స్థలం కొనుగోలు చేసి అక్కడ సొంత ఇల్లు నిర్మాణం పూర్తి చేశాడు. రామనాథపురంలో కాపురం పెట్టి తన పిల్లలను బాగా చదివించాలని పళని ఎప్పుడూ వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు చెప్పేవాడని తెలిసింది.
15 రోజుల క్రితం గృహప్రవేశం
ప్రస్తుతం సైనికుడు పళని భారత్- చైనా సరిహద్దులోని లడక్ లోయలో విధుల్లో ఉన్నాడు. రామనాథపురంలో పళని నిర్మించిన ఇల్లు పూర్తి అయ్యింది. ఇంటి గృహప్రవేశం రోజుకు కచ్చితంగా తాను వచ్చేస్తానని, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పళని ఆయన భార్య వానతీ దేవితో పాటు కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే తనకు సెలవు చిక్కలేదని, మీరు గృహప్రవేశం చెయ్యాలని, తరువాత తాను వస్తానని పళని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పళని రాలేదని భాదతోనే 15 రోజుల క్రితం రామనాథపురంలో కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం కార్యక్రమంలో ఆయన భార్య వానతీ దేవి, పిల్లలు ప్రసన్న, దివ్యాతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నేను ఫోన్ చేసే వరకు మీరు ఫోన్ చెయ్యకూడదు
వారం రోజుల క్రితం పళని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తాను లడక్ లోయలో విధుల్లో ఉన్నానని, ఇక్కడి పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని, ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం సాధ్యం కావడంలేదని అన్నాడు. మళ్లీ తాను ఎప్పుడు ఫోన్ చేస్తానో నాకే తెలీదని, నేను ఫోన్ చేసే వరకు మీరెవ్వరు ఫోన్లు చెయ్యకూడదని భార్య వానతీ దేవికి పదేపదే చెప్పాడు. సరే తరువాత నేను మీకు ఫోన్ చేస్తాను బై...బై... అంటూ చివరి సారిగా ఫోన్ లో మాట్లాడి కాల్ కట్ చేశాడు. తరువాత పళని నుంచి వారి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ రాలేదు.
పళని వీరమరణం
మంగళవారం భారత్- చైనా సరిహద్దులో జరిగిన దాడుల్లో పళని వీరమరణం పొందాడని రామనాథపురంలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అంతే విషయం తెలుసుకున్న పళని కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు. పళని భార్య వానతీ దేవి, ఇద్దరు పిల్లలను ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. పళని మరణవార్తతో ఆయన సొంత గ్రామంతో పాటు రామనాథపురం జిల్లాలో విషాదచాయలు నెలకొన్నాయి.
Recommended Video
రూ. 20 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం
వీరసైనికుడు పళని కుటుంబ సభ్యులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సానూభూతి తెలిపారు. పళని కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల పరిహారంతో పాటు వారి కుటుంబంలో విద్యార్హతను బట్టి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారు. సైనికుడు పళని మరణవార్త తనను దిగ్బాంతికి గురి చేసిందని సీఎం పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. పళని అంత్యక్రియలు ప్రభుత్వ లాంచానాలతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని రామనాథపురం జిల్లా కలెక్టర్ కు సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.