చైనా కిరికిరితో దెప్సాంగ్ లో హైటెన్షన్ - డ్రాగన్ ఆర్మీతో కీలక చర్చలు - ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ నుంచి వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన డ్రాగన్ బలగాలు.. దెప్సాంగ్ ప్రాంతంలో తిష్టవేశాయి. సరిహద్దు నుంచి బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకునేలా(డీఎస్కలేషన్ లేదా డిసెంగేజ్మెంట్) దౌత్య, సైనిక చర్చల్లో కుదిరిన అంగీకారంపై డ్రాగన్ దేశం కిరికిరి పెడుతున్నది. ఈ నేపథ్యంలో భారత్, చైనాల మధ్య శనివారం మరోసారి కీలక చర్చలు జరిగాయి. మరోవైపు, ఇదే దెప్సాంగ్ ప్రాంతంలో రెండు దేశాలూ భారీ ఎత్తున సైనిక, ఆయుధ సంపత్తిని సిద్ధం చేస్తున్నాయి.
Recommended Video
ఏపీ రాజధానికి జంట నగరాల కాన్సెప్ట్ - పంచ నదుల జిల్లాలో పాపాలు - విజయసాయిరెడ్డి దూకుడు
మేజర్ జనరల్స్ మీటింగ్..
తూర్పు లదాక్ లో టెన్షన్ నివారణ కోసం ఇప్పటికే చైనాతో ఐదు దశల్లో సైనిక చర్చలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో దౌత్యపరమైన చర్చలు జరిగాయి. లెఫ్టినెంట్ కమాండర్ల స్థాయిలో నాలుగో దశ చర్చల్లో డీఎస్కలేషన్ కు అంగీకారం కుదిరింది. అయితే, గాల్వాన్ లోయ నుంచి మాత్రమే వెనక్కెళ్లిన చైనా.. కొత్తగా దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. పాంగాంగ్ సరస్సును ఆనుకుని ఉండే ఫింగర్ పాయింట్స్ వద్ద కూడా మళ్లీ దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం నాటి మేజర్ జనరల్స్ స్థాయి చర్చల్లో ఈ అంశాలే ప్రధాన అజెండాగా ఉన్నాయి.
ఇండియా డిమాండ్ అదొక్కటే..
తూర్పు లదాక్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో చైనా వైపున్న స్థావరంలో శనివారం ఉదయం 11 గంటలకు చర్చలు ప్రారంభమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత బృందానికి.. 3వ మౌంటెయిన్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపత్ సారధ్యం వహిస్తున్నారు. గతంలో జరిగిన సైనిక చర్చలన్నీ 10 గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన నేపథ్యంలో తాజా చర్చల ఫలితాలు కూడా ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయి. కాగా, తాజా చర్చల్లోనూ భారత్ ‘‘డీఎస్కలేషన్'', ‘‘ఏప్రిల్ చివరి వారం నాటి యథాస్థితి(స్టేటస్)''ను డిమాండ్ చేయనుంది. చర్చల్లో మన డిమాండ్లకు అంగీకరిస్తూనే, అందుకు విరుద్ధంగా సైనిక మోహరింపును ముమ్మరం చేస్తోన్న చైనాకు ఈసారి దీటుగా జవాబిచ్చేందుకు భారత్ రెడీ అయింది.
అక్కడ 15వేల డ్రాగన్ జవాన్లు..
ఎల్ఏసీ వెంబడి భారత్ కు అతి కీలకమైన దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా ఇప్పటికే 15 వేల మంది జవాన్లను దింపింది. అక్సాయ్ చిన్ కూడా భారత్ లో భాగమేనని, త్వరలోనే దాన్ని స్వాధీనం చేసుకుంటామని కేంద్ర సర్కార్ పార్లమెంటులో ప్రకటన చేసిన దరిమిలా.. అక్సాయ్ చిన్ కు దారి తీసే అన్ని మార్గాల్లో చైనా అప్రమత్తమైంది. గడిచిన మూడు నెలలుగా జరుగుతోన్న పరిణామాలన్నీ అందులో భామేనని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. సైనిక బలగాలతోపాటు భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని సైతం చైనా పోగు చేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది.
ఐఏఎఫ్ డిప్యూటీ, ఆర్మీ చీఫ్ పర్యటన..
దెప్సాంగ్ లో చైనా మోహరింపులు పెరిగిన నేపథ్యంలో భారత్ సైతం అదే స్థాయిలో బలగాలను కొనసాగించాలని నిర్ణయించుకుంది. పాంగాంగ్ లోని ఫింగర్ 3 నుంచి భారత్ వెనక్కి వెళితే.. తాము ఫింగర్ 8 వరకూ వెనక్కెళతామన్న చైనా ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఇదిలా ఉంటే, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ హర్జిత్ సింగ్ అరోరా లదాక్ పర్యటన, ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే అస్సాం పర్యటన కీలకంగా మారింది. అస్సాంలోని తేజ్ పూర్ లో ఉన్న 4వ కోర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆర్మీచీఫ్ అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అరుణాచల్ సెక్టార్ లో రక్షణ బాధ్యతను 4వ కోర్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్ హర్జిత్ శుక్రవారం ఎల్ఏసీలోని కీలక ఎయిర్ బేస్ లను సందర్శించి, దేనికైనా సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించినట్లు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.
జగన్ పై సోము వీర్రాజు 'అయోధ్య' అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?