చైనా పన్నాగం: 2గంటల్లో ముట్టడించేలా.. చర్చల ముసుగులో భారీ కుట్ర.. టార్గెట్ ఫింగర్ 4..
భారత్-చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న పరిస్థితులు మరింత జఠిలంగా మారుతున్నాయి. గడిచిన 10 రోజులుగా శాంతి పునరుద్ధరణ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా.. చర్చల్లో పాల్గొంటూనే చైనా భారీ కుట్రకు తెరలేపింది. చర్చలకు మోకాలడ్డుతూ.. అదే సమయంలో సరిహద్దు వెంబడి భారీగా సైన్యాలను మోహరింపజేస్తున్నది. ప్రధానంగా పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని 'ఫింగర్ 4' ప్రాంతాన్ని ఆక్రమించేందుకు చైనా ఎత్తుగడలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆదివారం నాటికి మరింతగా బలపడ్డ డ్రాగన్.. కేవలం 2 గంటల వ్యవధిలోనే ఇండియాను ముంట్టడించేంత స్థాయిలో ఏర్పాట్లు చేసుకుందంటే సరిహద్దులో సిట్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు.. జగన్ సర్కారుపై ఎస్ఈసీ ధ్వజం.. కోర్టు ధిక్కారమంటూ ఫైర్..
సడలని ఉద్రిక్తత..
తూర్పు లదాక్ లోని దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య భారత్ నిర్మించిన 255 కిలోమీటర్ల రోడ్డు, ఇతర నిర్మాణాలను వ్యతిరేకిస్తోన్న చైనా.. గత 25 రోజులుగా సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో భారత సైన్యానికి అడ్డుతగులుతూ కవ్వింపునకు దిగుతున్నది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామన్న భారత్ ప్రతిపాదనకు అంగీకరించిన చైనా.. ఓవైపు సైనిక స్థాయిలో చర్చల్లో పాల్గొంటూనే.. గురు, శుక్రవారాల్లో ప్రభుత్వ పరంగానూ సానుకూల ప్రకటలను చేసింది. దీంతో టెన్షన్ తగ్గిపోతుందని అంతా భావించారు. కానీ చర్చల ముసుగులో చైనా పన్నిన పన్నాగం ఆదివారం నాటికి బటటబయలైంది..
భారీగా సైన్యం, ఆయుధాల చేరవేత..
ఫలితం లేని చర్చలతో కాలయాపన చేస్తోన్న చైనా.. అదే సమయంలో సీక్రెట్ గా తన భారీ వాహన శ్రేణులతో సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని భారత్ సరిహద్దు వరకు చేరవేసింది. ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించిన అంశాలను బట్టి.. లదాక్ ప్రాంతంలో గడిచిన రెండుమూడు రోజుల్లోనే చైనా బలగాల సంఖ్య ఇంకాస్త పెరిగింది. అదేసమయంలో చైనా సైనికులు.. భారత సరిహద్దులోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు కూడా పెరిగిపోయాయి. రెండు గంటల వ్యవధిలోనే భారత్ లోకి ప్రవేశించగలిగేలా చైనా తన సైన్యాన్ని సిద్ధం చేసిందని ఆర్మీ వర్గాలు చెప్పిన విషయాన్ని జాతీయ మీడియా పేర్కొంది.
టార్గెట్ ‘ఫింగర్ 4'
తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు.. సైనిక పరంగా రెండు దేశాలకు కీలకమైన ప్రాంతం. 134కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో మొత్తం 600చదరపు కిలోమీటర్లు విస్తరించిఉన్న ఈ సరస్సు 60 శాతం టిబెట్ ఆధీనంలో ఉన్నప్పటికీ, ఆ దేశాన్ని చైనా కబళించడంతో ఇప్పుడక్కడ డ్రాగన్ ఆర్మీ తిష్టవేసింది. ఈ సరస్సుకు ఉత్తరంగా ఉండే పర్వతాలను ‘ఫింగర్స్'అని పిలుస్తారు. ఫింగర్ 8 వరకూ భూభాగం మనదికాగా, చైనా మాత్రం ఫింగర్ 2 దాకా తన ప్రాంతమేనని గొడవపడుతోంది. ముఖ్యంగా ఫింగర్ 4 ప్రాంతం నుంచి చూస్తే భారత్ వైపు ఏం జరుగుతుందో, సైన్యం కదలికలు అన్నీ తెలుసుకునే వీలుండటంతో దాన్ని ఆక్రమించేందుకు చైనా కుట్రలు పన్నుతున్నది. ఆదివారం నాటికి చైనా తన బలగాలను మోహరించిన తీరును బట్టి దాని టార్గెట్ ఫింగర్ 4 అని స్పష్టంగా వెల్లడవుతోందని సైనికవర్గాలు పేర్కొన్నాయి.
ఎగతెగని చర్చలు..
సమస్యల పరిష్కారానికి శాంతియుత మార్గంలో మాత్రమే ముందుకు వెళతామన్న భారత్.. చైనాతో సరిహద్దు వివాదం పూర్తిగా ద్వైపాక్షికమని, ఇందులో అమెరికా జోక్యం, ట్రంప్ మధ్యవర్తిత్వం అనవసరమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. లదాక్, సిక్కింలో మే 5 కంటే ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో అదే స్టేటస్ కో పాటించేలా రెండు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే కమాండింగ్ ఆఫీసర్ల స్థాయిలో పలు భేటీలుకాగా అవన్నీ విఫలమయ్యాయి. ఆ తర్వాత బ్రిగేడియర్ స్థాయి అధికారుల మధ్యా సంవాదాలు నడిచినా ఫలితం రాలేదు. దీంతో మేజర్ జనరల్ ర్యాంకు అధికారుల మధ్య చర్చలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్ సిన్సియర్ గా శాంతి కోసం ప్రయత్నిస్తుంటే.. చైనా మాత్రం చర్చలతో కాలయాపన చేస్తూ, ఆ సమయాన్ని సైన్యం మోహరింపునకు వాడుకుంటున్నది.
దీటుగా స్పందిస్తోన్న భారత్..
కాగా, చైనా కుట్రలు బట్టబయలు కావడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సైనిక బలగాలను చైనా సరిహద్దుల్లో మోహరింపజేసే పనిని వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొన్న తూర్పు లదాక్, సిక్కింలోనే కాకుండా సరిహద్దు వెంబడి అన్ని కీలక పాయింట్ల వద్ద సైన్యాన్ని దింపాలని భారత్ డిసైడైంది. ఇవతలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను.. భారత బలగాలు గట్టిగా నిలువరిస్తున్నాయని విశ్వసనీయంగా తెలిసింది.
అసలేం జరుగుతోంది?
చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు, బలగాలు, ఆయుధాల మోహరింపు నేపథ్యంలో అక్కడేం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియజేయాలని మోదీ సర్కారును ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించగా, తాజాగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రం గుంభనంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని, సరిహద్దులో ఏం జరుగుతోందో స్పష్టత ఇవ్వాలని, ఒకవేళ చైనా దురాగతాలు నిజమైతే వెంటనే ప్రతీకార చర్యకు దిగాల్సిందేనన్నారు. చైనాతో వివాదంపై ప్రధాని మోదీ కార్యాలయం, రక్షణ మంత్రి రాజ్ నాథ్ వెంటనే వివరణ ఇవ్వాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.