స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ భారత్ తోపాటు చైనాలోనూ ఉత్పత్తి: వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన
మాస్కో: రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్పై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్ తోపాటు చైనాలోనూ జరగనుందన వెల్లడించారు. అంతేగాక, కరోనావైరస్ను ఎదుర్కొనే టీకా అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video
టీకా అభివృద్ధి పరిశోధన కేంద్రం..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పుతిన్ మాట్లాడారు.ముందుగా నిర్దేశించుకున్న విధంగానే బ్రిక్స్ దేశాల టీకాల పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా చొరవతో రెండేళ్ల క్రితమే ఈ కేంద్రం ఏర్పాటుకు బ్రిక్ దేశాలు అంగీకరించిన విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు.
భారత్ తోపాటు చైనాలోనూ స్పుత్నిక్ వీ ఉత్పత్తి..
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బ్రెజిల్, భారత్తో రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. అంతేగాక, వ్యాక్సిన్ ఉత్పత్తిపై భారత్, చైనాలోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇవి కేవలం ఆయా దేశ అవసరాలకే కాకుండా ఇతర దేశాలకు సరఫరాకు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తామని పుతిన్ వివిరంచారు.
ఇప్పటికే స్పుత్నిక్ వీ ఒప్పందం
కాగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తికి భారతదేశంలోని పలు సంస్థలతోపాటు హైదరాబాద్ నగరానికి చెందిన పలు ఫార్మా సంస్థలు కూడా ఒప్పందం పచేసుకోవడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరిగిన 12వ బ్రిక్స్ సదస్సులో భారత్ తోపాటు భాగస్వామ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసో ఈ సదస్సులో పాల్గొన్నారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని, కరోనాను పరస్పర సహకారంతో అంతం చేయాలని సదస్సులో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.