సరిహద్దులో టెన్షన్: భారత్-చైనా విదేశాంగ మత్రుల భేటీ - మాస్కో వేదికగా చర్చలు
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు ఇంకాస్త పెరిగిన ప్రస్తుత తరుణంలో.. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు కీలక చర్చలు జరిపారు. మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ఓసీ) సదస్సులో భాగంగా గురువారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భేటీ అయ్యారు.
నాలుగు నెలల ఉద్రిక్తతకు పరాకాష్టగా జూన్ 15న హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మళ్లీ సెప్టెంబర్ మొదటి వారం నుంచి సంఘర్షణ తారాస్థాయికి చేరింది. దాదాపు 45 సంవత్సరాల తర్వాత సరిహద్దులో కాల్పులు చోటుచేసుకున్నాయి. పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని వ్యూహాత్మక పాయింట్లను ఆక్రమించేందుకు చైనా చేసిన ప్రయత్నాలను భారత బలగాలు తిప్పికొట్టడమేకాదు, ఆ ప్రాంతమంతా పట్టు సాధించింది. దీంతో గాల్లో కాల్పులకు తెగబడిన చైనా.. ఇండియానే ఆక్రమణకు ప్రయత్నించిందని బుకాయించడం తెలిసిందే..
సైనిక స్థాయిలో ఇప్పటికే జరిపిన పలు దఫాల చర్చలు దాదాపు విఫలం కాగా, దౌత్య మార్గంలో అత్యున్నత స్థాయి భేటీగా జైశంకర్, వాంగ్ యీల సమావేశం గురువారం చోటుచేసుకుంది. ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్.. వాంగ్ యీతో చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ముందే ప్రకటించింది. సరిహద్దులో చైనా తీరు అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ, భారత్ మాత్రం శాంతియుత పంథాలోనే వెళుతుందని, చర్చల ద్వారానే విభేదాలను పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు.
భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తత సడలిపోయేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రష్యా ఇదివరకే ప్రకటించింది. ఆమేరకు జైశంకర్, వాంగ్ యీల మధ్య జరిగిన చర్చల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రొవ్ సైతం కాసేపు గడిపారు. భారత విదేశాంగ మంత్రితో భేటీ కావడానికి ముందు వాంగ్ యీ.. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీతో చర్చలు జరపడం గమనార్హం.
మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ఓసీ) సదస్సులో భాగంగానే గత శుక్రవారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఘేతో సమావేశమయ్యారు. తూర్పు లదాక్ లో ఉద్రిక్తతల్ని నివారించేందుకు తమ వంతు చర్యలు చేపడతామని నాటి భేటీలో చైనా చెప్పినప్పటికీ.. ఆ దిశగా ఎలాంటి కదలిక రాలేదు. పైగా శుక్రవారం రక్షణ మంత్రుల సమావేశం తర్వాత.. సోమవారం సాయంత్రం చైనా బలగాలు సరిహద్దులో కాల్పులు జరిపాయి. ఇనుపరాడ్లు, బరిసెలతో భారత్ పోస్టులపై దాడికి విఫలయత్నం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశాంగ మంత్రుల భేటీలోనైనా సత్ఫలితాలు వస్తాయా? అన్నది వేచి చూడాలి.