నేడు డ్రాగన్తో మరోసారి చర్చలు... దౌత్య వేదికపై ఏకాభిప్రాయం సరిహద్దులో కార్యరూపం దాల్చేనా..?
ఎడ తెగని వివాదం... ఎంతకీ దొరకని పరిష్కారం... ఎప్పుడు చర్చలు జరిగినా ఈసారైనా సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందా అన్న ఎదురుచూపులు... భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చర్చల పరంపరకు తెరలేచింది. ఇరు దేశాల మధ్య సోమవారం(సెప్టెంబర్ 20) ఉదయం 9గంటలకు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భూభాగంలోని మోల్దోలో ఈ చర్చలు జరగనున్నాయి. ఇదే నెలలో చుశూల్లో ఇరు దేశాల మధ్య జరిగిన బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు అసంపూర్తిగానే ముగియడంతో.... తాజా చర్చలతోనైనా పురోగతి లభిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
చైనా కొమ్ములు విరిచిన భారత్: వాస్తవాధీన రేఖ వద్ద ఆరు పర్వతాలపై త్రివర్ణ పతాకం రెపరెప
ఇది ఆరోసారి...
జూన్ 15 నాటి హింసాత్మక ఘర్షణల తర్వాత తరుచూ మిలటరీ స్థాయి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో సరిహద్దులో ఎప్పుడేం ఏం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో నేడు జరగనున్న సమావేశం ఆరోది. గతంలో లాగే వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణ,ఉద్రిక్తతల తగ్గింపు అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఎలాగైనా ఫలితం రాబట్టాలని...
తాజా సమావేశాల్లో భారత్ తరుపున మొట్టమొదటిసారి ఓ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కొంత ఫలితాన్ని రాబట్టాలని భారత్ భావిస్తోంది. ఇటీవలే రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ సదస్సులో భారత్-చైనా మధ్య కుదిరిన ఐదు అవగాహన ఒప్పందాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దౌత్య స్థాయిలో సాధించిన ఏకాభిప్రాయాన్ని సరిహద్దులో అమలుచేసేలా ఇరు దేశాల కార్ప్స్ కమాండర్ మధ్య చర్చలు జరగవచ్చు.
లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ నేత్రత్వం
తాజా చర్చలకు భారత్ తరుపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్,చైనా తరుపున మేజర్ జనరల్,సౌత్ జిన్జియాంగ్ మిలటరీ కమాండర్ లియూ లిన్ నేత్రుత్వం వహించనున్నారు. తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగాంగ్ త్సో సరస్సు, అక్కడి పర్వత ప్రాంతాలు,పలు ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్ కోరనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. రాబోయేది చలికాలమైనా చైనాను ఎదుర్కొనేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను కొనసాగించాలని భారత్ భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అక్కడ భారీగా బలగాలను మోహరించి, ఆయుధ సామాగ్రిని కూడా తరలించిన సంగతి తెలిసిందే.
Recommended Video
ఆ అంశాలు కార్యరూపం దాలుస్తాయా..?
మాస్కో వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య ఐదు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయం సరిహద్దులో ఎంత మేర కార్యరూపం దాలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఐదు అంశాల్లో... ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకోవడం... విభేదాలను వివాదాలుగా మారకుండా చూసుకోవడం... ఇరు దేశాల సైన్యం మధ్య చర్చల కొనసాగింపు... త్వరగా ఉపసంహరణ ప్రక్రియకు పూనుకోవడం... ఉద్రిక్తతలను తగ్గింపుకు చర్యలు... ఇప్పటికే కుదిరిన ప్రోటోకాల్స్ను పాటిస్తూ శాంతిని నెలకొల్పేలా చేయడం... విబేధాలకు ఫుల్ స్టాప్ పెట్టి పరస్పరం విశ్వాసంతో, శాంతి, సుస్థిరత నెలకొనేలా చూడటం వంటి అంశాలున్నాయి.