భారత్తో బంధం వర్షం లాంటిది: మరోసారి బుద్ధి బయటపెట్టుకున్న చైనా
భారత్- చైనా మధ్య బంధం వర్షాకాలంలో కురిసే వాన లాంటిదని చైనా కాన్సులేట్ జనరల్ హెంగ్ జియూన్ అన్నారు.
ముంబయి: భారత్- చైనా మధ్య బంధం వర్షాకాలంలో కురిసే వాన లాంటిదని చైనా కాన్సులేట్ జనరల్ హెంగ్ జియూన్ అన్నారు. పీపుల్స్ రిపబ్లిక్ చైనా 68వ వార్షికోత్సవం సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భారత్తో తమ బంధం వేర్వేరు సంవత్సరాల్లో నమోదయ్యే వర్షపాతం లాంటిదని హెంగ్ జియూన్ పోల్చారు. కొన్నిసార్లు మేఘాలు కమ్ముకుంటాయని డోక్లామ్ ఘటనను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేక ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. శాంతియుతంగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత మూడేళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేక ఒత్తిళ్లకు లోనయ్యాయని, ఈ ఏడాది డోక్లామ్ వద్ద తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
భారత్- చైనా- భూటాన్ కూడలి వద్ద చైనా దూకుడు ప్రదర్శించి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో సుమారు 70 రోజులపాటు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
అవన్నీ పక్కనపెట్టి రెండు దేశాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగాలని జియూన్ ఆకాంక్షించారు. అందుకోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గమ్యం చేరేంతవరకు ఇరు దేశాధినేతలు ఒకే పడవలో ప్రయాణం చేయాలని కోరారు.