చైనా రక్షణ మంత్రితో ఫేస్ టు ఫేస్ - డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్నాథ్ - అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత నానాటికీ పెరుగుతుండటం.. చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల చెరిపివేతకు చైనీస్ ఆర్మీ యత్నించడం, దాన్ని అడ్డుకున్న భారత బలగాలు.. పలు వ్యూహాత్మక పాయింట్లను కైవసం చేసుకోవడం.. దీంతో దెబ్బతిన్న చైనా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వరుస ప్రకటనలు చేస్తుండం.. తదితర పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించిన అత్యున్నత స్థాయి వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని చర్చలు జరిపారు..
Recommended Video
ఫెంఝీతో రాజ్నాథ్ ఫేస్ టు ఫేస్
రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న ‘షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) రక్షణ మంత్రుల సదస్సులో రాజ్ నాథ్ సింగ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఓపెన్ డయాస్ పై జరిగిన మంత్రుల భేటీలో రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ‘‘ప్రాంతీయ స్థిరత్వానికి నమ్మకం, పరస్పర సహకారం అత్యవసరమైన అంశాలు''అంటూ చైనా ద్వంద్వ నీతిని బాహాటంగా ఎండగట్టారు. ఆ తర్వాత చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీతో రాజ్ నాథ్ ఫేస్ టు ఫేస్ చర్చలు జరిపారు. గడిచిన నాలుగు నెలలుగా సైనిక, దౌత్య మార్గాల్లో జరిగిన చర్చలు విఫలమవుతోన్న నేపథ్యంలో రక్షణ మంత్రుల భేటీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
సర్వత్రా ఆందోళన..
చైనాతో విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు వరుసగా విఫలమవుతుండటంపై చైనా ప్రతినిధులకు రాజ్ నాథ్ తన అసహనాన్ని వ్యక్తపరిచినట్లు సమాచారం. అంతకుముందు మీటింగ్ లో చెప్పిన ‘‘నమ్మకం, పరస్పర సహకారం'' అనే పదాలను చైనీస్ రక్షణ మంత్రి ముందు ప్రస్తావించారని తెలుస్తోంది. చైనాతో వ్యవహారాలకు సంబంధించి ఇటు భారత అధికారులు సైతం అనూహ్య ప్రకటనలు చేయడం గమనార్హం. సంక్షోభం మరింత ముదిరిందని, గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత్ సైనికులను కోల్పోయిందని ఫారిన్ సెక్రటరీ వ్యాఖ్యానించగా, శత్రుదేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే అన్నారు.
రాజ్నాథ్కు ఓవైసీ చురకలు..
రష్యా వేదికగా చైనా రక్షణ మంత్రితో రాజ్ నాథ్ చర్చల నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్ నాథ్ గారూ... గడిచిన నాలుగు నెలలుగా తూర్పు లదాక్ లో తిష్టవేసిన చైనా సైన్యం ఇప్పటికే 1000 చదరపు కిలోమీటర్ల ఇండియా భూభాగాన్ని ఆక్రమించుకుంది. దీనిపై చైనా రక్షణ రక్షణ మంత్రిని నిలదీస్తారా? లేక ప్రధాని మోదీ కార్యాలయం చెప్పినట్లుగా ‘చైనా ఆక్రమణ జరగలేదని' సైలెంట్ గా ఉండిపోతారా? మాకు తెలుసుకోవాలని ఉంది'' అంటూ అసద్ ఎద్దేవా చేశారు. సరిహద్దులో ఒక్క అడుగు భూభాగాన్ని కూడా ఇతరులు ఆక్రమించలేదని కేంద్రం పదే పదే చెబుతుండటం, మీడియాలో మాత్రం విరుద్ధమైన రిపోర్టులు వస్తుండటం తెలిసిందే.