14గంటలు... డ్రాగన్తో సుదీర్ఘ చర్చలు... ఆ విషయంలో డెడ్లైన్ కోసం పట్టుబట్టిన భారత్...
ఏమీ మారలేదు... ఎప్పటిలాగే మరోసారి చర్చలు జరిగాయి కానీ పురోగతి లేదు... గత చర్చల మాదిరే చైనాతో భారత మిలటరీ తాజా చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. దాదాపు 14గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓవైపు పాంగోంగ్ త్సో సరస్సు దక్షిణ,ఉత్తర తీరం వెంబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా... ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ఓ కొలిక్కి రావట్లేదు. సోమవారం (సెప్టెంబర్ 22) జరిగిన చర్చలు కూడా అసంపూర్తిగా ముగియడంతో త్వరలోనే ఇరు దేశాల మధ్య మరోసారి మిలటరీ స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది.
Recommended Video
బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లే- డ్రాగన్కు మేలు చేశారిలా- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఆ విషయంలో పట్టుబట్టిన భారత్...
రష్యాలోని మాస్కో వేదికగా షాంఘై కోఆపరేషన్ సదస్సులో భారత్-చైనా విదేశాంగ మంత్రుల మధ్య ఐదు అంశాల్లో కుదిరిన ఏకాభిప్రాయంపై తాజా సమావేశంలో ఇరు దేశాల కార్ప్స్ కమాండర్స్ చర్చించారు. ఈ ఒప్పందాన్ని నిర్ణీత కాల వ్యవధిలో అమలుచేసేలా భారత ప్రతినిధి బృందం చైనాను పట్టుబట్టింది. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణకు గతంలో ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినా... దానికి నిర్ణీత కాల పరిమితిని నిర్ణయించలేదు. దీంతో ఆ ప్రక్రియ ముందుకు సాగినట్లే సాగి అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే మాస్కో ఒప్పందం అమలుకు ఒక నిర్ణీత కాల పరిమితిని(డెడ్ లైన్) నిర్ణయించాలని భారత్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే చైనా దీనిపై ఎలా స్పందించిందన్నది మాత్రం తెలియరాలేదు.
సైన్యం ఉపసంహరణపై...
వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసంహరణ,ఉద్రిక్తతల తగ్గింపును కూడా తాజా చర్చల్లో భారత్ చైనాతో మరోసారి ప్రస్తావించింది. 4 నెలలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే వీలైనంత త్వరగా సైన్యం ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుబట్టింది. అలాగే సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలను పెంచే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాలను,ప్రోటోకాల్స్ను తప్పనిసరిగా పాటించాలని చెప్పింది.
సమావేశాల్లో మొదటిసారి జాయింట్ సెక్రటరీ అధికారి...
తాజా సమావేశాల్లో భారత్ తరుపున మొట్టమొదటిసారి విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కొంత ఫలితాన్ని రాబట్టాలని భారత్ భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. తాజా చర్చలకు భారత్ తరుపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్,చైనా తరుపున మేజర్ జనరల్,సౌత్ జిన్జియాంగ్ మిలటరీ కమాండర్ లియూ లిన్ నేత్రుత్వం వహించారు. భారత్ తరుపున పాల్గొన్న ప్రతినిధి బృందంలో లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ కూడా ఉన్నారు. వచ్చే నెలలో 14 కార్ప్స్ కమాండర్గా హరీందర్ సింగ్ స్థానాన్ని పీజీకే మీనన్ భర్తీ చేసే అవకాశం ఉంది.
రంగంలోకి రాఫెల్...
మరోవైపు సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఫెల్ యుద్ద విమానాలు లదాఖ్లోని పలు ప్రాంతాలను గగనతలం నుంచి పర్యవేక్షించాయి. లదాఖ్లోని మంచు కొండల్లో సైతం ఈ యుద్ద విమానాలు సులువుగా లక్ష్యాలను చేధించగలవు. యుద్ద సన్నద్దతలో భాగంగానే రాఫెల్ విమానాలను భారత్ రంగంలోకి దించింది. ఇప్పటికే తూర్పు లదాఖ్లోని ఫ్రంటియర్ ఎయిర్ బేస్లో మిరాజ్ 2000,సుఖోయ్ 30 MKI యుద్ద విమానాలను కూడా భారత్ మోహరించింది. చైనా ఎప్పుడు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందో తెలియని పరిస్థితుల్లో.. భారత్ పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది.