చైనా నంబర్ 45... 8 నెలలకు బయటపెట్టిన లెఫ్టినెంట్ జనరల్... సరిహద్దులో ఇప్పటి పరిస్థితి ఇదీ...
గతేడాది జూన్లో తూర్పు లదాఖ్లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులవగా... చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై ఎక్కడా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. చైనా జవాన్లే ఎక్కువగా మరణించారని భారత్ చెప్పినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఆ హింసాత్మక ఘటన జరిగిన దాదాపు 8 నెలలకు మొదటిసారిగా లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
45 మంది చైనా జవాన్లు మృతి
గాల్వన్ లోయలో చోటు చేసుకున్న ఆ హింసాత్మక ఘటనలో 45 మంది చైనా జవాన్లు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ దాడి ద్వారా చైనా తమ జవాన్లను పోగొట్టుకున్నదే తప్ప సాధించిందేమీ లేదన్నారు. ప్రస్తుతం తూర్పు లదాఖ్లోని ప్యాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో సైన్యం ఉపసంహరణ ప్రక్రియ సాఫీగా సాగుతోందన్నారు. ఫిబ్రవరి 10న ఈ ప్రక్రియ మొదలైందని... మొత్తం నాలుగు దశల్లో ఇది పూర్తవుతుందని చెప్పారు.
మొత్తం నాలుగు దశల్లో...
మొదటి దశలో సాయుధ బలగాలు,మెకానికల్ రెజిమెంట్ను అక్కడినుంచి ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఆ తర్వాత రెండో దశ,మూడో దశల్లో ప్యాంగాంగ్ త్సో సరస్సుకు దక్షిణ,ఉత్తర భాగాన ఉన్న సైన్యాన్ని వెనక్కి రప్పించడం జరుగుతుందన్నారు. చివరి నాలుగో దశలో రెజాంగ్ లా,రెచిన్ లా,కైలాష పర్వత ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణ ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని శాటిలైట్స్,యూఏవీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని... కొన్నిచోట్ల కెమెరాలను సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు.
ఆ నిర్మాణాల తొలగింపు...
గతేడాది ఏప్రిల్కు ముందు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకూ చైనా చేపట్టిన నిర్మాణాలన్నింటినీ పూర్తిగా తొలగించబడుతున్నాయని జోషీ తెలిపారు. టెంట్లు,బంకర్లు,డగౌట్స్ ఇలా అన్నీ తొలగించేస్తున్నట్లు చెప్పారు. ప్యాంగాంగ్ త్సో ఉత్తర భాగాన భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వాదనలో నిజం లేదన్నారు. ఫింగర్ 8 భారత్ ఆధీనంలోనే ఉంటుందని... అక్కడి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటోందని చెప్పారు. ఈ పరిధిలో ఇకపై చైనాకు సంబంధించి ఎలాంటి మిలటరీ కార్యకలాపాలు ఉండబోవన్నారు.
వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చిన భారత్..
ఎట్టకేలకు సరిహద్దు ప్రతిష్ఠంభన ఒక కొలిక్కి రావడం భారత్కు కచ్చితంగా విన్-విన్ సిచ్యుయేషన్ అన్నారు. నిజానికి మొదట్లో చర్చల ద్వారా చైనా దారికి రాకపోవడంతో ఆర్మీ చీఫ్ నుంచి తనకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ మేరకు చైనా పట్ల తాము కూడా దూకుడుగా వ్యవహరించామని... రెజాంగ్ లా,రెచిన్ లా,ప్యాంగాంగ్ దక్షిణ,ఉత్తర తీరాల్లోని వ్యూహాత్మక శిఖరాలపై పాగా వేయగలిగామని అన్నారు. దీంతో చైనా ఒత్తిడికి లోనైందని... ఎట్టకేలకు భారత్ అనుకున్నట్లుగా సైన్యం ఉపసంహరణ కొనసాగుతోందని తెలిపారు.