ఆ కీలక ప్రాంతంలో ఇంకా అలాగే: ఈ సారి ఛాన్స్ తీసుకున్న చైనా: తమ భూభాగంపై: కాస్సేపట్లో చర్చలు
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద మూడు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులను పూర్తిగా చల్లార్చే దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. సరిహద్దు వివాదంపై చైనాతో మరోసారి చర్చలకు సిద్ధపడింది. ఈ రెండు దేశాల మధ్య లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల భేటీ కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. వాస్తవాధీన రేఖకు అవతల చైనా భూభాగంపై గల మోల్డోలో ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. మోల్డోలోని బోర్డర్ ఆర్మీ పర్సనల్స్ మీటింగ్ పాయింట్ వద్ద రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు చర్చల్లో పాల్గొంటారు.
వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొన్న తరువాత చేపట్టిన చర్చల పరంపరలో ఇది అయిదో సమావేశం. ఇప్పటికే నాలుగు దశల్లో చర్చలు అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి రెండు సమావేశాలు కూడా భారత భూభాగంపై గల ఛుసుల్లో ఏర్పాటు అయ్యాయి. ఈ సారి చైనా.. తమ భూభాగంపై గల మోల్డోలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవాధీన రేఖ సమీపంలో వివాదాస్పద ప్రాంతాలను చైనా సైనికులు ఖాళీ చేశారు. వాస్తవాధీన రేఖ నుంచి సుమారు రెండుకిలోమీటర్ల దూరం మేరకు వెనక్కి వెళ్లారు. యుద్ధ సామాగ్రిని సైతం వెనక్కి తరలించారు. తాత్కాలిక శిబిరాలను తొలగించారు.
గాల్వన్ వ్యాలీ సమీపంలో మాత్రమే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వెనక్కి మళ్లాయి. వాస్తవాధీన రేఖ వెంబడి లఢక్ తూర్పు ప్రాంతాన్ని చైనా బలగాలు ఇంకా పూర్తిగా ఖాళీ చేయలేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. కిందటి నెల 30వ తేదీన తూర్పు లఢక్ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చైనా సైన్యం వెల్లడించినప్పటికీ.. అది వాస్తవం కాదని తమ పరిశీలనలో తేలిందని అంటున్నారు. అటు భౌగోళికంగా, ఇటు రక్షణపరంగా భారత్కు కీలకమైన పంగ్యంగ్ త్సో లేక్, డెప్సాంగ్ వంటి ఒకట్రెండు ప్రాంతాలను చైనా బలగాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉందని, ఫింగర్స్ పాయింట్ ప్రాంతాల్లోనూ చైనా బలగాల మోహరింపు కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.
Recommended Video
ఆయా ప్రాంతాలను ఖాళీ చేయించడమే ప్రధానంగా చర్చల అజెండాను రూపొందించినట్లు పేర్కొన్నారు. లఢక్లోని 14 కార్ప్స్ లెప్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్, పీఎల్ఏ తరఫున కమాండర్ లియు ఈ భేటీకి ప్రాతినిథ్యాన్ని వహించనున్నారు. ఇప్పటిదాకా నాలుగుసార్లు సమావేశాలను నిర్వహించినప్పటికీ.. చైన వెనక్కి తగ్గలేదు. ఈ సారి ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. నాలుగు విడతలుగా సుదీర్ఘకాలం పాటు రెండు దేశాల సైనికుల మధ్య చర్చలు కొనసాగినా.. చైనా తన బెట్టు వీడలేదని, అయిదో దఫా చర్చలను ఫలప్రదం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.