ఇండో-చైనా బోర్డర్ టెన్షన్స్... అసంపూర్తిగానే ముగిసిన చర్చలు... మరోసారి సమావేశమయ్యే ఛాన్స్...
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారులు శనివారం (సెప్టెంబర్ 12) మరోసారి సమావేశమయ్యారు. చుషుల్లో ఉదయం 11గం. నుంచి మధ్యాహ్నం 3గం. వరకు జరిగిన ఈ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. దీంతో మరో 2 రోజుల్లో మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
లదాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేత్రుత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిన మరుసటి రోజే బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరగడం గమనార్హం. రాజ్నాథ్ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్,త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్,ఆర్మీ చీఫ్ ఎంఎం నవరణే,ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా హాజరయ్యారు.
రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ సదస్సులో ఇరు దేశాల మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలపై సమావేశంలో రాజ్నాథ్ చర్చించారు. ఇటీవల పాంగాంగ్ త్సో దక్షిణ తీరాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చేసిన విఫల యత్నాలను కూడా ఇందులో చర్చించారు.
కాగా,షాంఘై కోఆపరేషన్ సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరిన సంగతి తెలిసిందే. తాజా అవగాహన ఒప్పందం ప్రకారం... ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటూ.. విభేదాలు వివాదాలుగా మారకుండా ఇరు వర్గాలు చొరవ చూపాలి.
Recommended Video
ఇరు వర్గాలు మిలటరీ స్థాయి చర్చలు కొనసాగిస్తూ, త్వరగా సైన్యం ఉపసంహరణకు ఉపక్రమించాలి. భారత్- చైనా సరిహద్దు వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, ప్రోటోకాల్స్ను పాటిస్తూ, శాంతిని నెలకొల్పేలా చూడాలి. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై స్పెషల్ రిప్రెజంటేటివ్ మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి. బోర్డర్లో విభేదాలు సమసిపోయి, ఇరు వర్గాల్లో పరస్పరం విశ్వాసం నింపి, శాంతి, సుస్థిరత నెలకొనేలా ఇరు దేశాలు సమర్థవంతంగా పనిచేయాలి.