చైనాకు భారత్ స్నేహ హస్తం: చర్చల ద్వారా: 6న తొలి విడత: లెప్టినెంట్ స్థాయిలో మిలటరీ
న్యూఢిల్లీ: సరిహద్దు గొడవులను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతోన్న డ్రాగన్ కంట్రీ చైనాతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే దిశగా భారత్ తొలి అడుగు వేసింది. లడక్లో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఈ నెల 6వ తేదీన తొలి విడత అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కానుంది. అటు చైనా, ఇటు భారత్ సైన్యం నుంచి లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధృవీకరించారు.
బుస కొడుతోన్న డ్రాగన్: టిబెట్ వద్ద కఠిన వాతావరణంలో చైనా మాక్ వార్ డ్రిల్: 4700 మీటర్ల ఎత్తున
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించానికి ఈ నెల 6వ తేదీన ఇరు దేశాల సీనియర్ సైనికాధికారుల మధ్య జర్చలను నిర్వహించబోతున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లడక్లో సరిహద్దు వివాదంపై లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య ఈ అత్యున్నత స్థాయి భేటీ ఏర్పాటు కానుందని అన్నారు. లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని అత్యధిక సంఖ్యలో మోహరింపజేసిందనే విషయాన్ని ఆయన ధృవీకరించారు. యుద్ధ సామాగ్రిని సైతం తరలించిందని చెప్పారు.
చైనా వేస్తోన్న ప్రతి అడుగును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దీనిపై తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. కిందటి నెల 5న లడఖ్ తూర్పు ప్రాంతంలో సరిహద్దు చైనా సరిహద్దు వద్ద గల పాంగాంగ్ త్సో తీరంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని అన్నారు. ఆ ఘర్షణ వాతావరణం తరువాతే ఈ ఉద్రిక్తత తలెత్తిందని చెప్పారు. నెలరోజులుగా చైనా-భారత్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంటోందని, దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.
లడఖ్ ఘర్షణల అనంతరం మే 9న ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలోని సిక్కిం సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగిన సంగతి తెలిసిందే. అవి కాస్తా యుద్ధానికి దారి తీసే పరిస్థితిని కల్పించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి యుద్ధ శిక్షణను ఇస్తోంది. వార్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఓ పూర్తిస్థాయి యుద్ధానికి అవసరమైన సామాగ్రిని, పదాతిదళాన్ని తరలించింది.
Recommended Video
ఈ పరిణామాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చినప్పటికీ.. చైనా తిరస్కరించింది. భారత్ సైతం తాము ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో చర్చల ద్వారా ఉద్రిక్తతలను నివారించుకునే దిశగా భారత్ ఓ అడుగు ముందుకు వేసింది. సరిహద్దు వివాదంపై చర్చించడానికి తాము సిద్ధమంటూ చైనాకు సమాచారం ఇవ్వడంతో డ్రాగన్ కంట్రీ కూడా దీనికి సుముఖతను వ్యక్తం చేసింది. ఫలితంగా- జూన్ 6న రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.