శాటిలైట్ ఫొటోల విశ్లేషణలో షాక్: సరిహద్దుల్లో భారీగా చైనా సైన్యం..యుద్ధ సామాగ్రి: 72 గంటలు
న్యూఢిల్లీ: భారత్తో యుద్ధానికి చైనా సన్నద్ధమౌతోందా? కేంద్ర పాలిత ప్రాంతం లడక్ సమీపంలో గల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరింపజేసిందా? యుద్ధ సామాగ్రిని తరలించిందా? భారత్ తీసిన ఉపగ్రహ ఫొటోలు ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం ఈ ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానాలన్నీ వాస్తవ రూపం దాల్చేలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు ఢిల్లీ స్థాయిలో వినిపిస్తున్నాయి.
Recommended Video
ప్రధానికి ట్రంప్ ఎమర్జెన్సీ ఫోన్కాల్: మోడీ మూడ్ ఏమీ బాగాలేదు..కలవర పడుతున్నారు: ఏ క్షణమైనా
సరిహద్దుల్లో మోహరించిన పీఏల్ఏ
లడక్ సమీపంలో భారత్-చైనా సరిహద్దుల విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలీవానగా మారుతోంది. యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. లడక్ సమీపంలో సరిహద్దులకు అవతల చైనా భూభాగంపై పెద్ద ఎత్తున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు మోహరించినట్లు కేంద్రం గుర్తించింది. యుద్ధ సామాగ్రిని సైతం తరలించినట్లు అంచనా వేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా పెద్ద సంఖ్యలో సైనిక బలగాలు, యుద్ధ సామాగ్రిని లడక్ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద సరిహద్దులకు తరలించినట్లు భావిస్తోంది.
శాటిలైట్ ఫొటోల విశ్లేషణలో
లడక్ సరిహద్దుల వెంబడి తీసిన ఉపగ్రహ ఫొటోలను విశ్లేషించగా ఈ విషయం బయట పడిందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇదివరకు ఎప్పుడూ ఈ స్థాయిలో పీఎల్ఏ సైన్యం గానీ, యుద్ధ సామాగ్రి గానీ కనిపించలేదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లు తన కథనంలో పేర్కొంది. రెండు దేశాలకు కూడా గాల్వన్ వ్యాలీ వ్యూహాత్మక ప్రదేశమని కేంద్రం భావిస్తున్నట్లు రక్షణమంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసినట్లు ఆ కథనం వెల్లడించింది.
16 యుద్ధ ట్యాంకులు
గాల్వన్ వ్యాలీ సమీపంలో 16 యుద్ధ ట్యాంకులను మోహరింపజేసినట్లు శాటిలైట్ ఫొటోల విశ్లేషణలో తేలింది. ఇందులో ఇన్ఫాంట్రీ కొంబట్ వెహికల్స్, ఫ్లాటెడ్ ట్రక్స్, ఎక్స్కావేటర్ మెషీన్లు, డంపర్ ట్రక్స్ వంటివి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. శాశ్వత ప్రాతిపదికన అక్కడ పీఎల్ఏ సైనిక శిబిరాలను నెలకొల్పడానికి అవసరమైన చర్యలను చేపట్టినట్టుగా కనిపిస్తోందని అంచనా వేశారు. ఎలాంటి పరిస్థితునైనా ధీటుగా ఎదుర్కొనేలా బంకర్లను సైతం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
పంగోంగ్పైనే దృష్టి..
ఈ నెల 5, 6 తేదీల్లో భారత్, చైనా జవాన్ల మధ్య తోపులాటకు దారి తీసిన పంగోంగ్ త్సో (Pangong Tso) ప్రాంతం ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు ఎపిక్ సెంటర్గా మారినట్లు తెలుస్తోంది. చైనా ఇదివరకే ఆక్రమించినట్లుగా భావిస్తోన్న ఫాక్స్హోల్ పాయింట్ వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా సైనికులు మోహరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వాస్తవాధీన రేఖ (Line Of Actual Control-LAC) వెండి ఉన్న గోగ్రా, పెట్రోలింగ్ పాయింట్-14, పెట్రోలింగ్ పాయింట్-15, ఫోర్ ఫింగర్, గ్రీన్ టాప్ పాయింట్లలో పీఎల్ఏ బలగాలు మోహరించినట్లు లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ కొంఛోక్ తెలిపారు.
ఆ గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంటుందా?
లడక్ సరిహద్దుల్లో ఉన్న గ్రామీణుల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు. వచ్చే 72 గంటల అతి కీలకంగా మారొచ్చని అంటున్నారు. ఎల్ఏసీ వెంబడి ఉన్న మెరక్, ల్యూకుంగ్, ఉరుంగ్, మ్యాన్, స్పాంగ్మిక్, కక్సెటల్ వంటి గ్రామాలన్నీ లేహ్ జిల్లా పరిధిలోకి వస్తాయని, ఆయా గ్రామాల ప్రజలు ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయాందోళనల్లో ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. భారత్ వైపు నుంచి పెద్ద ఎత్తున బలగాలు సరిహద్దులకు కదులుతున్నారని అంటున్నారు.