భారత్-చైనా సరిహద్దు వివాదం... తెర పైకి కొత్త ప్రతిపాదన... ఇదైనా అమలవుతుందా..?
గత ఆర్నెళ్లుగా కొనసాగుతున్న వివాదం... ఇప్పటివరకూ 8 సార్లు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు... మాస్కో వేదికగా షాంఘై కోఆపరేషన్ సదస్సులో అవగాహన ఒప్పందం కుదిరినా... అది అమలుకు నోచుకోని వైనం... ఇలా భారత్-చైనా సరిహద్దు వివాదం ఎడతెగకుండా సాగుతూనే ఉంది. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్ ఎంత ప్రయత్నిస్తున్నా ఇన్నాళ్లు చైనా మొండి వైఖరి కారణంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్తతల తగ్గింపు,సైన్యం ఉపసంహరణకు కొత్త ప్రతిపాదన తెర పైకి వచ్చింది.
Recommended Video
ఏంటా కొత్త ప్రతిపాదన...
తూర్పు లదాఖ్లోని ఘర్షణ ప్రాంతాల్లో ఒకటైన పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర తీర ప్రాంతంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు కొన్నాళ్లు 'నో ప్యాట్రోలింగ్ జోన్'గా పాటించాలన్న ప్రతిపాదనను పరిగణిస్తున్నట్లు భారత అధికారిక వర్గాలు చెప్తున్నాయి. భారత్-చైనా ఇరువురు ఇక్కడి నుంచి దళాలను ఉపసంహరించుకుని... కొన్నాళ్ల పాటు మళ్లీ అక్కడ అడుగుపెట్టకుండా ఉండాలన్న ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఈ ప్రతిపాదనతోనైనా సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా తొలి అడుగుపడుతుందని భారత్ ఆశిస్తోంది.
మొదటినుంచి భారత్ అదే చెబుతోంది...
తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఏడాది ఏప్రిల్ ముందువరకు ఉన్న యధాతథ స్థితిని కొనసాగించాలని భారత్ మొదటినుంచి చైనాను కోరుతోంది. పాంగాంగ్ త్సో సరస్సు వెంబడి ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు వాస్తవాధీన రేఖగా చెబుతోంది. కానీ చైనా మాత్రం ఏకపక్షంగా స్టేటస్ కోని మార్చేసి ఫింగర్ 4ని ఆక్రమించింది. ఫింగర్ 8 వరకూ తమ సైన్యాన్ని మోహరించింది. దీంతో దక్షిణం వైపున్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ పాగా వేసి చైనా కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతోంది.
దక్షిణ తీరం నుంచి భారత్ తప్పుకుంటుందా?
సరిహద్దు వివాదానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో పాంగాంగ్ త్సో సరస్సు నుంచే సైన్యం ఉపసంహరణ ప్రక్రియ చేపట్టాలన్న ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు ఇరువైపులా రెండు దేశాలు ప్యాట్రోలింగ్ని ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ కూడా ఈ ఏడాది అగస్టులో ఆక్రమించిన దక్షిణ తీరంలోని వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేసే అవకాశం ఉంది. చివరి రెండు మిలటరీ కమాండర్స్ సమావేశాల్లో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈసారైనా అమలయ్యేనా?
అయితే ఇప్పటివరకూ ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని... గ్రౌండ్లో వీటి అమలుకు ఇంకా పరస్పర అంగీకారం కుదరలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి సరిహద్దులో ఉద్రిక్తతల తగ్గింపుకు ఇలాంటి ప్రతిపాదనలు ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలోనూ చైనా సైన్యం ఉపసంహరణ విషయంలో అనేక కొర్రీలు పెట్టింది. ముందు భారత్ పాంగాంగ్ త్సో దక్షిణ తీరాన్ని ఖాళీ చేస్తేనే... ఉత్తర తీరం నుంచి తాము వెనక్కి వెళ్తామని పేచీ పెట్టింది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనలు ఎంతమేరకు అమలుకు నోచుకుంటాయో చూడాలి.