పాక్ ఒక్కటే కాదు.. ఇక చైనా కూడా: పక్కలో బల్లెంలా..దండెత్తడానికి రెడీగా: ఏమిటీ ఎల్ఏసీ?
న్యూఢిల్లీ: ఒకవంక కరోనా దేశం మొత్తాన్నీ కమ్మేసింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ వైరస్ బారిన పడి చోటు అంటూ మనదేశంలో ఏదీ లేదు. యావత్ దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలోనే ఏడో స్థానంలో నిలిచింది భారత్. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి కుదురుగా కూర్చోనివ్వట్లే డ్రాగన్ కంట్రీ. యుద్ధానికి దిగడానికి సమాయాత్తమౌతోంది. సరిహద్దుల్లో మాటువేసుకుని కూర్చుంది.
అండర్గ్రౌండ్లో ట్రంప్: రక్షణ కోసం బంకర్లో: మెలానియా సహా: ఆంటిఫాపై ఉగ్రముద్ర: అనూహ్యంగా
అటు పాక్.. ఇటు డ్రాగన్
ఒకవంక పాకిస్తాన్.. పాకిస్తాన్ మరోవంక చైనా. ఈ రెండూ పక్కలో బల్లెంలా తయారయ్యాయి. కబలించడానికి రెడీ అవుతున్నాయి. రక్షణపరంగా ఈ రెండు దేశాలను ఢీ కొట్టగల శక్తిసామర్థ్యాలు మనదేశానికి ఉన్నాయి. అందులో సందేహాలు అక్కర్లేదు. అయినప్పటికీ.. యుద్ధానికి దిగే సానుకూల పరిస్థితులు దేశంలో లేవు. జమ్మూ కాశ్మీర్ వైపు పాకిస్తాన్ ఒక్కటే తరచూ సరిహద్దు వివాదాలను సృష్టిందనుకుంటోంటే.. కొత్తగా చైనా కూడా తయారైంది. లడక్ వైపు నుంచి మనదేశంపై దండెత్తడానికి సన్నాహాలను చేస్తోంది. ప్రస్తుతం ఈ ఎల్ఏసీ భారత్ చైనా మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. యుద్ధానికి దారి తీసే పరిస్థితులను కల్పించింది.
రెండు దేశాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోన్న వాస్తవాధీన రేఖ
ఇన్నాళ్లూ ఎల్ఓసీ గురించి విన్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయడానికి ఉద్దేశించిన నియంత్రణ రేఖ ఇది. కొత్తగా లడక్ వైపు ఎల్ఏసీ వివాదానికి చైనా కారణమైంది. లడక్ వైపు భారత్, చైనా మధ్య అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని వేరు చేయడానికి ఉద్దేశించిన వాస్తవాధీన రేఖ ఇది. భారత్, చైనాలను విడదీయడానికి ఉద్దేశించిన మెక్మోహన్ రేఖకు అదనంగా దీన్ని తీసుకొచ్చారు. లడక్ భూభాగం పరిధిలోకి వచ్చే అక్సాయ్ చిన్ ప్రాంతం భారత్, చైనా మధ్య వివాదాస్పద భూమిగా ఉంటోంది. దాన్ని వేరు చేస్తూ విధించిన సరిహద్దును వాస్తవాధీన రేఖగా గుర్తిస్తున్నారు.
వాస్తవాధీన రేఖను దాటుకుని
చైనా తరచూ ఈ వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొరబడటానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), భారత సరిహద్దు జవాన్ల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సరిహద్దుల్లోని గాల్వన్ నదీలోయ తీరాన్ని దాటుకుని భారత భూభాగంపైకి దూసుకొచ్చిన పీఎల్ఏ సైనికులను భారత జవాన్లు అడ్డుకున్నారు. ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న 48 గంటల వ్యవధిలో చైనా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటుకుని వచ్చాయి. భారత గగనతలంలో చక్కర్లు కొట్టి వెనక్కి మళ్లాయి.
ఈ పరిణామాలతో ఉద్రిక్తత
ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి కాస్తా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. లడక్ సమీపంలో సరిహద్దుకు అవతల తన భూభాగంపైకి పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరింపజేస్తోంది చైనా. యుద్ధ సామాగ్రిని సైతం తరలించింది. కొత్తగా పదాతి దళాలను కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా మోహరింపజేసింది. కొత్తగా సైనిక శిబిరాలు కూడా చైనా భూభాగంపై వెలిశాయి. ఈ పరిణామాల పట్ల భారత్ అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు అక్కడి వాతావరణాన్ని సమీక్షిస్తోంది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనడానికి సిద్ధమౌతోంది.
భారత్ చైనా మధ్య సరిహద్దును కుదించి చూపుతోన్న చైనా
భారత్ చైనా మధ్య 3488 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. లడక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ విస్తరించింది. ఈస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్గా దీన్ని విభజించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాన్ని ఈస్టర్న్ సెక్టార్గా పిలుస్తారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్న ప్రాంతాన్ని మిడిల్ సెక్టార్లోకి చేర్చారు. లడక్ వెస్టర్న్ పరిధిలోకి వస్తుంది. ఈ అంతర్జాతీయ సరిహద్దు పొడవును కుదించి చూపుతోంది చైనా 2000 కిలోమీటర్ల మేర మాత్రమే అంతర్జాతీయ సరిహద్దు ఉందని వాదిస్తోంది. అందుకే అటు అరుణాచల్ ప్రదేశ్, ఇటు సిక్కిం సమీపంలోని డోక్లాం, నకులా పాస్, తాజాగా లడక్ సమీపంలో సరిహద్దు భూభాగాలు తమవేనంటూ భీష్మిస్తోంది.