సరిహద్దులో ఉద్రిక్తత: షూటింగ్ రేంజ్లో భారత్-చైనా బలగాలు, దొంగ డ్రాగన్కు అదే రీతిలో జవాబు
న్యూఢిల్లీ: చైనా తన వక్రబుద్ధిని పదే పదే చాటుకుంటోంది. ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. ఒప్పందాలకు కట్టుబడి ఉంటామంటూనే కయ్యానికి కాలు దువ్వుతూ సరిహద్దులో భారీగా బలగాలను మోహరిస్తోంది డ్రాగన్ దేశం. చైనా కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న భారత భద్రతా దళాలు డ్రాగన్ దేశానికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి.
షూటింగ్ రేంజ్లో భారత్-చైనా బలగాలు..
తాజాగా, ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ త్సో దక్షిణ భాగమైన స్పంగ్గుర్ గ్యాప్ వద్ద ఓ వైపు చైనా బలగాలు, మరోవైపు భారత సైన్యం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. దాదాపు రైఫిల్ షూటింగ్ రేంజ్లో ఇరుదేశాలు బలగాలు మోహరించాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
చైనా కొత్త రకం కుట్రలపై భారత్ డేగ కన్ను..
ఆగస్టు 30 నుంచి వేల సంఖ్యలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతఘ్నులను తరలిస్తోంది. ముఖ్యంగా స్పంగ్గూర్ గ్యాప్ నుంచి గురాంగ్ హిల్, మగర్ హిల్ సమీపంలోకి చేరుకున్నాయి. దీంతో భారత్ కూడా అదే స్థాయిలో దళాలను తరలించింది. మిలీషియా దళాలను కూడా చైనా తరలించడం గమనార్హం. వీటిలో సైనికులతోపాటు బాక్సర్లు, స్థానిక ఫైట్ క్లబ్ సభ్యులు ఉంటారని భావిస్తున్నారు. ఈ బృందాలు పీఎల్ఏలో రిజర్వు ఫోర్స్గా పనిచేస్తున్నాయి. ఈ బలగాలు పీఎల్ఏ సైనిక ఆపరేషన్లలో సహకరిస్తుంటాయి.
Recommended Video
భారత్ అలర్ట్... తోకముడుస్తున్న డ్రాగన్
చైనా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న భారత సైనికులు.. ఆగస్టు 28 రాత్రి రాత్రి తొలిసారి మాల్దోలో సాయుధ వాహనాల కదలికలను గుర్తించాయి. దీంతో డ్రోన్లను రంగంలోకి దించి పీఎల్ఏ కదలికలిపై మరింత నిఘా పెంచారు. చైనా బలగాలు ఎల్ఏసీ వైపుగా కదులుతున్నట్లు వెంటనే భారత ఎస్ఎఫ్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. దీంతో చైనా బలగాలు అక్కడ్నుంచి వెనక్కి వెళ్లక తప్పలేదు. ఈ క్రమంలో భారత దళాలు ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉత్తర భాగంలోని ఫింగర్ 4 సమీపంలోని కీలక ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుంది. శాంతి చర్చలంటూ రాత్రిపూట దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు.. అదే రీతిలో భారత దళాలు ధీటుగా జవాబు చెబుతుండటంతో డ్రాగన్ దేశానికి వెనక్కి వెళ్లడం తప్ప వేరే దారిలేకుండా పోతోంది.