మానవాభివృద్ధి సూచీలో మెరుగుపడిన భారత్ ర్యాంక్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సోమవారం విడుదల చేసిన 2019 మానవ అభివృద్ధి సూచీలో భారత ర్యాంక్ స్వల్పంగా మెరుగుపడింది. గత ఏడాది కంటే ఒక స్థానం పైకి ఎగబాకింది. 2018 సంవత్సరంలో భారత్ 0.647 మానవాభివృద్ధి విలువతో 130వ ర్యాంకులో ఉండగా.. ప్రస్తుతం ఒక మెట్టు పైకెక్కి 189 దేశాలకు గానూ 129వ స్థానంలో నిలిచింది.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కమిటీ వెల్లడించిన దీని తాలూకు నివేదికలను భారత స్థానిక ప్రతినిధి షోకో నోడా వెల్లడించారు. భారత్లో 2005-06 నుంచి 2015-16 వకు మొత్తం 27.1కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. భారత మానవ అభివృద్ధి విలువ దాదాపు 50శాతం పెరిగింది. పేదరికాన్ని తగ్గించడంలో దక్షిణాసియాలో భారత్ సహా పలు దేశాలు మంచి విజయం సాధించాయని తెలిపారు.
నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 1990-2018 మధ్య కాలంలో భారత్లో ఒక వ్యక్తి జీవితకాలం 11.6 సంవత్సరాలు పెరిగింది. తలసరి ఆదాయం 250 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా దక్షిణాసియాలో 31 శాతం మంది మహిళలు భాగస్వామి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది.
మహిళా సమానత్వ అభివృద్ధి సూచీలో(జీడీఐ) తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలు రెండో అత్యధిక స్థానాన్ని సాధించాయి. ఈ విషయంలో దక్షిణాసియాలో ఎక్కువగా వివక్షత ఉన్నట్లు వెల్లడించింది. సింగపూర్లో మహిళలపై వేధింపులు తక్కువని పేర్కొంది.
ఈ సూచిలో దక్షిణాసియాలో భారత్ కాస్త మెరుగుపడింది. ఈ విషయంలో 162 దేశాలకు గానూ (0.829) విలువతో 122వ స్థానంలో నిలిచింది. 1990-2018 మధ్యలో దక్షిణాసియా ప్రాంతం 46 వాతం మేర సత్వర వృద్ధి సాధించిందని, ఆ తర్వాత తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలు 43 శాతం వృద్ధిని సాధించాయని వెల్లించింది. రాబోయే తరంలో ముఖ్యంగా సాంకేతికత, విద్య, పర్యావరణ సంక్షోభం విషయంలో కొత్తగా అసమానతలు ప్రారంభమవుతామయని నివేదిక పేర్కొంది.