కరోనాకేసుల ఊగిసలాట: కాస్త తగ్గిన కొత్తకేసులు; లక్షా ఏడువేల యాక్టివ్ కేసులు!!
భారతదేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా కొత్త కేసులు కాస్త తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో శుక్రవారం 17,070 తాజా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. మునుపటి రోజు 18,819 పోలిస్తే 1800లకు పైగా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 23మరణాలు నమోదయ్యాయి. మళ్ళీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.
14,413 మంది గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారి నుండి బయట పడ్డారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,189కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రోజువారీ కరోనా కేసుల సానుకూలత రేటు 3.40 శాతంగా ఉంది. వారపు సానుకూలత రేటు 3.59 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతమున్న యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 0.25 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.55 శాతానికి చేరుకుంది.
నిన్న ఒక్కరోజే 5.02లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4.34 కోట్ల మందికి కరోనా సోకగా ఇప్పటి వరకు 4.28 కోట్ల మంది కరోనాను జయించారు. 5.25 లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకు 197 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. ఇక కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.
మాస్కులు ధరించాలని, సామాజిక దూర నిబంధనలు పాటించాలని పదే పదే హెచ్చరిస్తుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కరోనా మహమ్మారి రూపు మార్చుకుంటుంది కానీ తగ్గలేదని చెప్తుంది. మహమ్మారి మళ్ళీ అనేక దేశాలలో వ్యాప్తి చెందుతుందని చెప్పి అలెర్ట్ చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.