భారత్లో 74 కరోనా పాజిటివ్ కేసులు.. వ్యాక్సిన్ తయారీపై ఆసక్తికర విషయాలు..
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది.ఇప్పటికే ఇక్కడ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత శుక్రవారం జకీర్ హుస్సేన్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్దారించారు.దాంతో అతని కుటుంబ సభ్యులైన ఆరుగురుని క్వారెంటైన్లో మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచారు. వీరి బ్లడ్ శాంపిల్స్ను ఢిల్లీలోని ల్యాబ్కి పంపించారు.
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తయారీకి.. ఎంత వేగవంతంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినా.. భారత్కు ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చునని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐసీఎంఆర్ డివిజన్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనికేషన్ డిసీజెస్ -1 (ఇసిడి-ఐ) అధినేత రామన్ ఆర్ గంగాఖేద్కర్ మాట్లాడుతూ పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైరస్ను వేరు చేయడంలో విజయవంతమైందన్నారు.
నిజానికి కరోనా వైరస్ను శాంపిల్స్ నుంచి వేరు చేయడం(ఐసోలేషన్) అత్యంత క్లిష్టమైనదని.. కానీ పుణే వైరాలజీ సైంటిస్టులు అందులో విజయవంతమయ్యారని చెప్పారు. ప్రస్తుతం 11 ఐసోలెటెడ్ కరోనా వైరస్ నమూనాలు వారి వద్ద ఉన్నాయని.. కరోనాకు సంబంధించిన ఎలాంటి పరిశోధనకైనా ఇవే ప్రధాన అవసరమని తెలిపారు. వ్యాక్సీన్ తయారీకి రెండు మార్గాలు ఉన్నాయని గంగాఖేద్కర్ పేర్కొన్నారను. ఒకటి,వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని గుర్తించి ప్రతిరోధకాలను అభివృద్ధి చేయడం, లేదా మనపై ఆ ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు కచ్చితంగా వ్యాక్సిన్ను అభివృద్ది చేయడమని చెప్పారు.
వైరస్ శాంపిల్స్ టెస్టింగ్ కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వం 52 ల్యాబోరేటరీలను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే తమ వద్ద 1లక్ష టెస్టింగ్ కిట్స్ ఉన్నాయని.. మరిన్ని కిట్స్ కోసం ఆర్డర్ చేశామని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.