కరోనా మరణాల సంఖ్య పెంపు వెనక..? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులే కాదు మరణాలు కూడా ఎక్కువే సంభవిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 2 వేల మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఐదురెట్ల మరణాలు సంభవించాయి. అయితే ఇందులో వెయ్యికి పైగా మరణాలు ముంబైలో నమోదు కాగా.. మహారాష్ట్రతో కలిపి ఆ సంఖ్య 1400కి చేరింది. అంతకుముందు రోజు మహారాష్ట్రలో కేవలం 81 మంది మాత్రమే చనిపోయారు.
ఢిల్లీలో మంగళవారం 437 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 1837కి చేరింది. సోమవారం తమిళనాడులో 44 మంది చనిపోగా, మంగళవారం 49 మంది మృతిచెందారు. తమిళనాడులో రోజుకు 10 నుంచి 15 మంది వరకు చనిపోతున్నారు. మృతుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిస్తుండగా, ఏజెన్సీల అంచనా మరోలా ఉంది. దీంతో మరణాలు రేటు పెరుగుతోంది.
దేశంలో మరణాల రేటు 3.34 శాతంగా ఉంది. మంగళవారం నాటి మృతుల సంఖ్యతో అది పెరిగింది. కానీ ముంబై, తిరువనంతపరానికి చెందిన పరిశోధకులు మాత్రం దీనిని తప్పుపడుతున్నారు. సరైన పద్ధతిలో లెక్కించడం లేదు అని.. కరోనా వైరస్ మరణాలు ఎక్కువే ఉండే అవకాశం ఉంది అని వివరిస్తున్నారు. సోమవారం దేశంలో వైరస్ కేసుల ప్రాణాంతక నిష్పత్తి 3.43 లక్షల కేసులతో 9900 మరణాలను లెక్కిస్తే సీఎఫ్ఆర్ 2.91 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే మరణాల గురించి కచ్చితమైన సమాచారం కోసం 14 రోజుల సీఎఫ్ఆర్ లెక్కించాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు. ఆ ప్రకారం దేశంలో సీఎఫ్ఆర్ 5.03 శాతంగా ఉంటుంది.