కరోనా: ప్రమాదకరంగా పాజిటివిటీ రేటు -రెండో దశ కేసుల్లో వైచిత్రి -టెస్టులు అదే స్థాయిలో ఉన్నా
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని వార్తలు చదువుతున్నాంగానీ, అది ఎలా జరిగిందనే విశ్లేషణ కూడా అవసరం. టెస్టులు చేయించుకునే వారి సంఖ్య పెరిగింది కాబట్టి కొత్త కేసులు పెరిగాయనే వాదన తప్పంటూ గతేడాది తొలి వేవ్ కు, ప్రస్తుత సెకండ్ వేవ్ కు మధ్య తేడాలకు సంబంధించి కీలక సమాచారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది..
బిగ్ న్యూస్: కొవిడ్ రోగులకు ఊరట -రెమ్డెసివిర్ ధర భారీ తగ్గింపు -ఒక ఇంజెక్షన్ ఇప్పుడు రూ.899
చాలా రాష్ట్రల్లో గడిచిన 15 రోజుల్లోనే పాజిటివిటీ రేటు రెట్టింపైంది. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు సగటున 13.5 శాతానికి పెరిగింది. పాజిటివిటీ రేటు అనేది వైరస్ వ్యాప్తికి కొలమానమని, వైరస్ ఎంత ఎక్కువగా వ్యాపించిందనడానికి సంకేతమన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నమోదవుతోన్న పాజిటివిటీ రేటును బట్టి గడిచిన రెండు నెలల్లో వైరస్ వ్యాప్తి ఎంత భారీ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
గతేడాది తొలి దశతో పోల్చితే ప్రస్తుత రెండో దశలో ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతుండటం, కొత్త కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో రెండు లక్షలు దాటింది. నిజానికి ఇప్పుడున్న పాజిటివిటీ రేటు.. గతేడాది జులై చివరి వారంలో నమోదైన పాజిటివిటీ రేటుతో సమానం. కానీ కేసుల సంఖ్యలో మాత్రం తేడా రెట్టింపుగా ఉంది. గతేడాది జూలై చివరి వారంలో పాజిటివిటీ రేటు గరిష్ట స్థాయికి చేరింది. సెప్టెంబర్ దాకా పాజిటివ్ కేసుల ఉధృతంగా వచ్చినా పాజిటివిటీ రేటు మాత్రం క్రమంగా తగ్గుతూ వచ్చింది. అంటే వైరస్ వ్యాప్తి తగ్గిందన్నమాట. కేవలం టెస్టుల సంఖ్య పెంచడం వల్లే గత ఆగస్టు, సెప్టెంబర్ లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
తొలి వేవ్ లో జులై చివరి నాటికి దేశంలో మొత్తం టెస్టుల సంఖ్య 5లక్షల లోపే ఉండేది. ఆగస్టు చివరి నాటికి రోజువారీ టెస్టుల సంఖ్య 10 లక్షలకు పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి రోజూ 10లక్షల పైచిలుకు టెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ టెస్టుల సంఖ్య దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుండగా, 2020 సెప్టెంబరు గరిష్ట సమయంలో కంటే ఇప్పుడు 2.5 రెట్లు ఎక్కువ కేసులు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం (మార్చి 17న) దేశవ్యాప్తంగా 14లక్షల పైచిలుకు టెస్టులు చేశారు. అంటే, కేసుల పెరుగుదల టెస్టులు పెంచినందుకు కాకుండా, పాజిటివిటీ రేటు పెరిగినందుకేనని స్పష్టమవుతోంది. ఉదాహరణకు..
మొదటి దశ వ్యాప్తి నుంచీ మహారాష్ట్ర మన దేశంలో కొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో టాప్ లో ఉంది. తొలి దశ పీక్స్ లో అక్కడ పాజిటివిటీ రేటు 15 శాతంగా నమోదైంది. విచిత్రంగా రెండో దశ వ్యాప్తిలో ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలో నమోదవుతోన్న పాజిటివిటీ రేటు మహారాష్ట్రను అధిగమించడం గమనార్హం. తొలి దశలో అసలు ఛత్తీస్ గఢ్ లో పెద్దగా కేసులు కూడా రాలేదు. గడిచిన సెప్టెంబర్ నుంచీ ఛత్తీస్ లో రోజూ 50వేలకు తగ్గకుండా టెస్టులు చేస్తున్నా, ఇప్పుడు మాత్రమే పాజిటివిటీ రేటు పెరిగిందంటే, గడిచిన రెండు నెలల వ్యవధిలో వైరస్ వ్యాప్తిని అంచనావేయొచ్చు. ఛత్తీస్ గఢ్ ఒక్కటేకాదు
ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో తొలి దశలో పెద్దగా కేసులు రాలేదు. పాజిటివిటీ రేటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత రెండో దశలో మాత్రం అక్కడ కొత్త కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. వైరస్ సంక్రమణం విపరీతంగా పెరిగినందుకే అధిక పాజిటివిటీ రేటు నమోదవుతుండొచ్చు లేదా వైరస్ మ్యుటేషన్లుగా, డబుల్ మ్యుటేషన్లుగా ఏర్పడి వేగంగా వ్యాప్తి చెందుతుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని విదర్భలో తాజాగా కొత్త వేరింట్ ను గుర్తించారు. ఆ ప్రాంతంలో చేపట్టిన టెస్టుల్లో 60 శాతం నమూనాల్లో డబుల్ మ్యూటెంట్ ను గుర్తించారు.
దేశంలో కొవిడ్ టెస్టుల ప్రక్రియ కూడా స్టాచ్యురేషన్ కు చేరినట్లయింది. ప్రస్తుతం రోజూ 14 నుంచి 15 లక్షల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. ఈ సంఖ్య గతేడాది అక్టోబర్ నాటి టెస్టులతో దాదాపు సమానం. కానీ కేసులు మాత్రం ఆ సమయంలో కంటే ఇప్పుడు అధికంగా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 2.34 లక్షల కేసులు, 1,341 మరణాలు నమోదయ్యాయి. కొత్త వేరియంట్లు, ప్రజల్లో అవగాహన లేమి, ప్రభుత్వాల నిర్లక్ష్యం, వ్యాక్సిన్ ఉందనే ధీమా మొత్తానికి పరిస్థితిని మళ్లీ ప్రమాదకరంగా మర్చాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా సర్వత్రా అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.