దేశంలో కరోనా పరిస్థితి: 47 రోజుల తర్వాత కోలుకున్నవారి కంటే పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు
న్యూఢిల్లీ: దేశంలో గత కొద్ది వారాలుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చినప్పటికీ.. తాజాగా, మరోసారి పెరుగుదల నమోదు చేసింది. తాజాగా, నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. కేవలం 22 రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే.. అమెరికా తర్వాత భారత్లోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులున్నాయి. అయితే, యాక్టివ్ కేసులు మాత్రం ఐదు శాతానికి దిగువన ఉండటం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో 4,43,794గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 4.93 శాతానికి తగ్గింది. అదే సమయలో రికవరీల సంఖ్య 84,28,409కు చేరింది. ఇది 93.60శాతంగా ఉంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా విడుదల చేసిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 45,882 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 44,807గా ఉంది. అయితే, కరోనా నుంచి కోలుకున్నవారి కంటే కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు కావడంతో గత 47 రోజుల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాగా, గత 24 గంటల్లో 584 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,32,162కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 10,83,397 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ లాంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగానూ కేసులు పెరుగుదల నమోదు చేస్తున్నాయి.