కరోనాపై ‘మండే’ ఎఫెక్ట్: దేశంలో ఒక్కసారిగా తగ్గిన పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం ఒక్కసారిగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇందుకు గల కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా నిన్న గణనీయంగా కొత్త కేసుల నమోదు తగ్గిపోయింది. ఆదివారం చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
ఆదివారం భారీగా. సోమవారం తక్కువగా..
జమ్మూకాశ్మీర్లో ఆదివారం 600లకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, సోమవారం మాత్రం 198 కొత్త కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఆదివారం, సోమవారం నమోదైన కేసులను పరిశీలించినట్లయితే చాలా తేడానే ఉంది.
దేశంలోనూ అంతే..
దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆదివారం 8605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం 7837 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 768 కరోనా కేసులను మిగితా రాష్ట్రాలకు చేర్చాల్సినవి ఉన్నాయి. సోమవారం కంటే ముందు దాదాపు నాలుగు రోజులపాటు వరుసగా రోజూ దాదాపు 10వేల కేసులు నమోదయ్యాయి.
సడలింపుల నేపథ్యంలో..
మే నెల మధ్యలో నుంచి కరోనా లాక్డౌన్ సడలింపులు ఎత్తివేసుకుంటూ రావడంతో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వలస కూలీలను ఇతర రాష్ట్రాల నుంచి తమ సొంత రాష్ట్రాలకు తరలించే క్రమంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం వరకు క్రమంగా పెరుగుకుంటూ వచ్చిన కేసులు సోమవారం మాత్రం తగ్గడం గమనార్హం.
ఢిల్లీలోనూ సోమవారం తగ్గిన కేసులు
ఢిల్లీలో ప్రతి రోజూ 1300 నుంచి 1500 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, సోమవారం మాత్రం కేవలం 1000 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీతోపాటు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సడలింపులు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అస్సాం, త్రిపుర, కేరళ, గోవా, ఉత్తరాఖండ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జన సంచారం ఎక్కువగా కావడంతో మరింతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.