సీజనల్ వ్యాధుల ముసురు: కరోనా తీవ్రత ఎలా ఉంది?: వరదల ఎఫెక్ట్: మరణాల్లోనూ అనూహ్యంగా
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల రోజువారీ సంఖ్య.. తాజాగా మరింత క్షీణించింది. ఇదివరకెప్పుడూ లేని స్థాయిలో పడిపోయింది. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలోనూ భారీగా తగ్గుదల రికార్డయింది. మరణాల సంఖ్య సగానికి తగ్గింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, సీజనల్ వ్యాధులు ముసురుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కరోనా వైరస్ తీవ్రత తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 55,722 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 579 మంది మరణించారు. ఈ స్థాయిలో రోజువారీ కరోనా కేసులు తగ్గడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. మరణాల్లోనూ భారీ క్షీణత కనిపించింది. ఇదివరకు 70 వేల నుంచి 90 వేల వరకు రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఈ నెల ఆరంభం నుంచీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అత్యల్పంగా 55 వేలకు పడిపోయింది. మృతుల సంఖ్యలోనూ అదే స్థాయి తగ్గుదల నమోదైంది. ఇదివరకు గరిష్ఠంగా రోజూ 1100 నుంచి 1200 వరకు కరోనా మరణాలు నమోదు అయ్యేవి. ఆ సంఖ్య 579కి తగ్గింది.
ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 75,50,273కు చేరుకుంది. కేసులు పెరుగుతున్నా.. అందులో వేగం తగ్గడం శుభపరిణామమని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని అంటున్నారు. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు 7,72,055. ఆదివారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే.. 11,256 మేర తగ్గాయి. డిశ్చార్జి అయిన వారి సంక్య 66,63,608కి చేరింది. డిశ్చార్జిల్లో 66,399 కొత్తగా జత అయ్యాయి. మొత్తం మరణాలు 1,14,610కి చేరింది.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఆశించిన స్థాయిలో నమోదు కావట్లేదు. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్యలో క్షీణత కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకు గరిష్ఠంగా 11 లక్షలకు పైగా రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు నమోదు అయ్యాయి. వరదల వల్ల వాటి సంఖ్య తొమ్మిది లక్షల కంటే దిగువకు పడిపోయింది. ఆదివారం 8,59,786 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 9,50,83,976కు చేరింది.
Recommended Video