డేంజర్ బెల్స్ : యూకెని దాటేసి 4వ స్థానంలోకి భారత్.. రైల్వే ఐసోలేషన్ కోచ్లు పంపించాలన్న రాష్ట్రాలు..
కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ బ్రిటన్ను దాటి నాలుగో స్థానానికి ఎగబాకింది. గురువారం(జూన్ 11) సాయంత్రం నాటికి 2,95,772 కరోనా కేసులతో భారత్.. 2,92,588 కేసులున్న బ్రిటన్ను దాటింది. భారత్ కంటే ముందు వరుసలో అమెరికా,బ్రెజిల్,రష్యా టాప్-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం 20,76,094 కేసులు ఉండగా.. బ్రెజిల్లో 7,87,489 కేసులు,రష్యాలో 5,02,436 కేసులు ఉన్నాయి. మే 24వ తేదీన టాప్-10 జాబితాలోకి ప్రవేశించిన భారత్.. ఆ తర్వాత కేవలం 18 రోజుల్లోనే నాలుగో స్థానానికి రావడం గమనార్హం.
దేశంలో కొత్తగా 9996 కేసులు
భారత్లో మార్చి 25న లాక్ డౌన్ ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 500 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం మొదలైంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 3,607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనాతో 8102 మంది మృతి చెందగా.. మహారాష్ట్రలో 3483 మంది మృతి చెందారు.
ఐసోలేషన్ రైల్వే కోచ్లు కావాలన్న రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభిస్తుండటంతో ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ తయారుచేసిన ఐసోలేషన్ కోచ్లను పంపించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు 240 కోచ్లు కావాలని కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ 60,తెలంగాణ 10 కోచ్లు కోరాయి. ఢిల్లీలో కరోనా పేషెంట్లకు పడకలు అందుబాటులో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కరోనా యాప్ మాత్రం.. ఢిల్లీలో 7oశాతం పడకలు అందుబాటులో ఉన్నాయని చూపిస్తోంది. చెన్నై,ముంబైలోనూ పడకల కొరత ఉందన్న విమర్శలున్నాయి. ఇక తెలంగాణలో కేవలం గాంధీ ఆస్పత్రి పైనే ఆధారపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధింపు..?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్పై చర్చ జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పలు ఫేక్ మెసేజ్లు కూడా పుట్టుకొచ్చాయి. జూన్ 15 తర్వాత ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించబోతుందని... రైళ్లు,విమాన సర్వీసులు రద్దు చేయబడుతాయని అందులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. లాక్ డౌన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు వదంతులను నమ్మవద్దని తెలిపింది.