ఆర్సీఈపీ ఒప్పందానికి దూరం: జాతి ప్రయోజనాల దృష్ట నిర్ణయమన్న మోడీ
థాయ్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)లో చేరబోమని స్పష్టంచేశారు. ఆర్సీఈపీలో ఇండియా భాగస్వామ్యం కాబోదని అధికారులు వెల్లడించారు. తాము లేవనెత్తిన ఆందోళనలపై ఒప్పందంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఆర్సీఈపీపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలోని చైనా దిగుమతుల దృష్ట్యా ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచే ఒప్పందానికి భారత్ దూరంగా ఉందని తెలిసింది. ఒప్పందంలో అసలు ఉద్దేశం కొరవడిందని ప్రధాని మోదీ ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భారత్ ప్రాంతీయ సమైక్యత, స్వేచ్చ వాణిజ్యానికి కట్టుబడి ఉందని మోడీ స్పష్టంచేశారు.
ఆర్సీఈపీ నుంచి చర్చల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించిందని తెలిపారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి కోసం పనిచేసిందని తెలిపారు. కానీ ఏడేళ్ల నుంచి చర్చల సమయంలో అంతర్జాతీయ వాణిజ్య పోకడల్లో మార్పులు వచ్చాయని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఆర్సీఈపీలో స్పూర్తి కొరవడిందని.. భారత్ లేవనెత్తిన ఆందోళనలపై ఒప్పందంలో ప్రస్తావన లేదని పేర్కొన్నారు. భారతీయుల ప్రయోజనాల దృష్ట్యా.. తన మనసు కూడా అంగీకరించలేదని మోడీ తెలిపినట్టు సమాచారం.
ఆసియాన్లో 10 సభ్యదేశాలు కాగా.. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. స్వేచ్చ వాణిజ్యానికి సంబంధించి ఆర్సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే ఆ మేరకు దిగుమతి సుంకాలను ఆయా దేశాలు తొలిగిస్తాయి. ఇప్పటికే చైనా వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తడంతో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.