భారత్ -చైనా వివాదం: లడాఖ్లో భారత ఆర్మీ అదనపు బలగాలు... ఏం జరుగుతోంది..?
లడాఖ్ : భారత్లో చైనా దౌత్యాధికారి సన్ వెడాంగ్ వాస్తవాధీన రేఖవద్ద చైనా బలగాల పరిస్థితిపై పూర్తి స్పష్టతను ఇవ్వని నేపథ్యంలో భారత్ తన బలగాలను కూడా పెంచుతూ వివాదాస్పద ప్రాంతంలో మోహరించింది. ఇక దీనిపై ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ స్పందించారు. చైనా తీసుకునే చర్యల ఆధారంగానే భారత ఆర్మీ కూడా అడుగులు వేస్తుందని చెప్పారు. అంటే చైనా తమ బలగాలను వాస్తవాధీన రేఖ నుంచి ఉపసంహరించుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున భారత బలగాలు కూడా గట్టిగా సమాధానం చెప్పేందుకు సన్నద్ధమై ఉన్నాయని చెప్పారు. అందుకే ఎల్ఏసీ వద్ద భారత బలగాలను ఇంకా ఉంచామని చెప్పుకొచ్చారు.
ఏం మారలేదు... పాంగోంగ్ వద్ద చైనా అదే దూకుడు... శాటిలైట్ చిత్రాలు బయటపెట్టిన వాస్తవాలు...
చైనాకు బుద్ది చెప్పేందుకేనా...
అంటే రెండు దేశాలు ఒక కచ్చితమైన ఒప్పందానికి వచ్చి ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకునేవరకు భారత్ బలగాలను అక్కడే మోహరిస్తుందనేది సీనియర్ ఆర్మీ అధికారి మాటల ద్వారా స్పష్టమవుతోంది. చైనా అంబాసిడర్ మాత్రం చాలా చోట్ల పూర్తిస్థాయిలో చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని చెప్పారు కానీ ఇంకా కొన్ని చోట్ల బలగాలు మోహరించే ఉన్నాయని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పాట్రోలింగ్ పాయింట్ 17ఏ మరియు పాంగాంగ్ ట్సో సరస్సు వద్ద ఇంకా చైనా బలగాలు మోహరించి ఉన్నాయని భారత్ చెబుతోంది.
స్టేటస్ కో అమలు చేస్తేనే ఉపసంహరణ
ఏప్రిల్లో స్టేటస్ కో మెయిన్టెయిన్ చేయాలని రెండు దేశాలు భావించాయని, అయితే చైనా మాట తప్పుతున్నందున లడాఖ్లో అదనంగా 35వేల మంది జవాన్లను ఉంచామని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ వైకే జోషి చెప్పారు. ఎప్పుడైతే స్టేటస్ కో అమలు చేసేందుకు చైనా సమ్మతిస్తుందో అప్పుడే భారత బలగాల ఉపసంహరణ ఉంటుందని వైకే జోషి స్పష్టం చేశారు. స్టేటస్ కో అంటే రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకోవడం, అదే సమయంలో వివాదాస్పద ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ పనులను నిలిపివేయడం లాంటివి ఉన్నాయి. అంతేకాదు మే నెలకు ముందు ఎలా అయితే పాట్రోలింగ్ పద్దతులను పాటించారో అలాంటివి తిరిగి అమలు కావాలని భారత్ కోరుతోంది.
Recommended Video
ఎలాంటి పరిస్థితి వచ్చినా సిద్ధం
కనీసం ఒక డివిజన్కు చెందిన బలగాలు లడాఖ్లోనే మోహరించి ఉంటాయని వీరంతా ఎలాంటి పరిస్థితి తలెత్తినా సిద్దంగా ఉంటారని మరో అధికారి వెల్లడించారు. అయితే చైనా వైపు పరిస్థితి ఎలా ఉంటుందో దాన్ని బట్టి బలగాలను పెంచడమా లేక తగ్గించడమా చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే మరో సారి మిలటరీ స్థాయి చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. గత రెండు వారాలుగా చైనా అవలంబిస్తున్న తీరులో ఎలాంటి మార్పు లేదు. ఫింగర్ 4వద్ద చైనా బలగాలు మాటు వేసే ఉన్నాయి. అంతేకాదు భారత్ పాట్రోలింగ్ టీమ్ను అడ్డుకుంటున్నట్లు సమాచారం.