భారత దౌత్య విజయం: యూరోపియన్ పార్లమెంటులో సీఏఏ వ్యతిరేక తీర్మానాలపై ఓటింగ్ వాయిదా
న్యూఢిల్లీ: భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంటులో ఐదు విభిన్న తీర్మానాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాలపై బుధవారం చర్చ జరిగింది. అయితే, గురువారం ఈ తీర్మానాలపై ఓటింగ్ జరుగుతుందని అంతా భావించినప్పటికీ అది మార్చిలో జరిగే సమావేశాలకు వాయిదా పడింది.
బుధవారం బ్రస్సెల్స్లోని యూరోపియన్ పార్లమెంటులో సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టబడిన తీర్మానాలపై చర్చ జరిగింది. అయితే గురువారం ఈ తీర్మానాలపై ఓటింగ్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. మార్చికి వాయిదా వేసినట్లు యూరోపియన్ పార్లమెంట్ ఒక ప్రకటనలో బుధవారం రాత్రి వెల్లడించింది.
భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలే యూరోపియన్ పార్లమెంటులో సీఏఏకు వ్యతిరేక తీర్మానాలపై ఓటింగ్ వాయిదా పడటానికి కారణాలుగా తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. కారణం మాత్రం భారత దౌత్యం ఫలించడమేనని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. యూరోపియన్ పార్లమెంటులో పాకిస్థాన్ కంటే భారత స్నేహితులే ఎక్కువగా ఉన్నారని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించడం గమనార్హం.
సీఏఏకు సంబంధించి తాము వివరించిన అంశాలు యూరోపియన్ పార్లమెంటేరియన్స్ కు పూర్తి స్థాయిలో అర్థమై ఉంటుందని, అందుకే పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించలేదని సంబంధిత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
We expect that our perspectives on CAA will be understood by all objective and fair-minded EU parliamentarians: Govt sources
— Press Trust of India (@PTI_News) January 29, 2020
పెట్టుబడులపై ప్రభావం
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను యూరోపియన్ యూనియన్(ఈయూ) వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సీఏఏ, కాశ్మీర్ అంశాలపై కీలకంగా చర్చించిన తర్వాత భారత్తో పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోవాలని యూరోపియన్ యూనియన్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇండియా-ఈయూ వార్షిక సదస్సులో కూడా సీఏఏ, కాశ్మీర్ అంశం గురించి చర్చిస్తామని ఈయూ అధికారి ఒకరు తెలిపారు. మార్చి 13న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జరిగే ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ అంశాలు గురించి సదస్సులో కీలకంగా చర్చిస్తామని ఈయూ అధికారి తెలిపారు.
బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ అగ్రీమెంట్(బీటీఐఏ), బిలిటరల్ ఇన్వెస్ట్మెంట్(బీఐపీఏపై ఈ అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉందన్నారు. ఈయూకు భారత్ కీలకమైన భాగస్వామి అని ఆయన తెలిపారు. భారత్ ప్రస్తావించే అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
అంతకు ముందు పరిణామాలు
భారత్ తీర్మానాలు ప్రవేశపెట్టిన ఐదు గ్రూపుల రాజకీయ పార్టీల సభ్యులను కలిసి వారికి సీఏఏ గురించి వివరించే ప్రయత్నం చేసింది. భారత్ చేసిన ప్రయత్నాలు కొంత మేర ఫలించాయనే చెప్పవచ్చు. 66 మంది సభ్యులు గల యూరోపియన్ కన్సర్వేటివ్స్, రిఫార్మిస్ట్స్(ఈసీఆర్) ఈ తీర్మానంకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. దీంతో మిగితా ఐదు గ్రూపులు మాత్రమే తీర్మానంకు మద్దతుగా ఉన్నాయి. 751 మంది సభ్యుల్లో 560 మంది సభ్యులు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానంకు మద్దతు పలుకుతున్నారు. అయితే, చివరకు ఈ తీర్మానంకు ఎంత మంది మద్దతు ఇస్తారో తెలియదు.
23 మంది సభ్యుల యూరోపియన్ పార్లమెంటరీ బృందం ఇటీవల భారతదేశంలోపర్యటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇతర సీనియర్ అధికారులు వారిని కలిశారు. శ్రీనగర్లో పరిస్థితులను ఆ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఈ బృందానికి భారత అధికారులు ఇక్కడి పరిస్థితులను వివరించారు.
కాగా,
గత
నెలలో
ఐక్యరాజ్యసమితి
మానవ
హక్కుల
కమిషన్(యూఎన్హెచ్ఆర్సీ)
భారతదేశం
చేసిన
చట్టం
వివక్షను
చూపేదిగా
ఉందని
పేర్కొన్న
విషయం
తెలిసిందే.
ఈ
అంశంపైనా
యూరోపియన్
పార్లమెంటులో
చర్చ
జరిగే
అవకాశం
ఉంది.
యూఎన్,
ఈయూ
మార్గదర్శకాలు,
మానవ
హక్కులను
పరిగణలోకి
తీసుకుని
తీర్మానంపై
చర్చించనున్నారు.
వివక్ష చూపే ఆ చట్టాన్ని విరమించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరనుంది. సీఏఏ చట్టం ద్వారా కొందరిని వివక్ష పూరితంగా వ్యతిరేకించడం సరికాదని, అది విభజనకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులను కూడా సీఏఏలో చేర్చాలని కోరింది.
ఇది ఇలావుంటే, భారతదేశం ఇప్పటికే యూరోపియన్ పార్లమెంటుకు ఖచ్చితమైన సమాధానమిచ్చింది. సీఏఏ తమ అంతర్గత విషయమని, దీనిపై జోక్యం సరికాదని స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో విదేశాలు కల్పించుకోవడం సరికాదని యూరోపియన్ పార్లమెంటుకు, విదేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓం బిర్లా తేల్చి చెప్పారు.
అయితే, యూరోపియన్ పార్లమెంటులో రోజువారీ వ్యవహారాల్లో భాగంగా డ్రాఫ్ట్ రిజల్యూషన్స్ ప్రవేశపెడుతుంటారని.. ఇది కేవలం ఆయా రాజకీయ పార్టీలు ప్రాధాన్య అంశాలను తీసుకుని రూపొందించినవేనని ఈయూ అధికార ప్రతినిధి హెన్రిక్సన్ తెలపడం గమనార్హం. ఆయా తీర్మానాల్లో సభ్యులు అభిప్రాయాలు ఈయూ అధికార స్థానానికి మాత్రం ప్రాతినిథ్యం వహించవని తెలిపారు.
కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొని అక్కడ బతకలేని స్థితిలో మనదేశానికి శరణార్థులుగా వచ్చిన మైనార్టీల(హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్ట్రియన్లు, ఇతర మైనార్టీలు)కు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవరు వ్యతిరేకించినా దేశంలో సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.