అరుదైన గౌరవం: యూన్ హాబిటేట్ ప్రెసిడెంట్గా వెంకయ్య, మోడీ అభినందన
ఐక్యరాజ్య సమితి పరిధిలోని (యుఎన్-హాబిటేట్) ఆవాస పాలకమండలి అధ్యక్షుడిగా కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి పరిధిలోని (యుఎన్-హాబిటేట్) ఆవాస పాలకమండలి అధ్యక్షుడిగా కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. కెన్యా రాజధాని నైరోబీలో సోమవారం జరిగిన సంస్థ 26వ పాలకమండలి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
భారత్ ఏకగ్రీవం
కెన్యాలో జరిగిన 26వ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో ఆవాస మండలి అధ్యక్ష పదవికి భారత్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రపంచంలో సామాజిక, పర్యావరణపరంగా నిలుదొక్కుకోగల నివాసాలను నిర్మించటం ఈ మండలి ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం కెన్యా పర్యటనలోవున్న వెంకయ్యనాయుడు ఐరాసా నివాస పాలక మండలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించటం గమనార్హం.
1978లో..
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణపరంగా, సామాజికంగా సుస్థిరమైన ఇళ్ల నిర్మాణం కోసం ఐరాస ఆధ్వర్యంలో 1978లో యుఎన్-హాబిటేట్ సంస్థ ఏర్పడింది. సంస్థకు 1988, 2007లో భారత ప్రభుత్వ ప్రతినిధులు అధ్యక్షత వహించారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వెంకయ్యనాయుడికి ఆ అవకాశం దక్కింది. మానవ స్థిర నివాసాల ఏర్పాటులో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఈ సంస్థ ఆయా దేశాలకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ సమన్వయాన్ని పెంచుతుంది.
వెంకయ్య పిలుపు
ఆసియా-పసిఫిక్ మంత్రుల గృహ, పట్టణాభివృద్ధి సదస్సులకు వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించి కీలకోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి పట్టణ ప్రణాళికలను పునఃసమీక్షించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ దృష్ట్యా ప్రజలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలతో, తగిన సౌకర్యాలు కల్పించాలని, భారత్లో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి, ఇప్పటివరకు ఉన్న లోపాలను సరిదిద్దడానికి కేంద్ర పథకాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.
మోడీ అభినందన
కాగా, ఐక్యరాజ్య సమితి ఆవాస మండలి గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అత్యంత సమర్థంగా పని చేయటంతోపాటు భవిష్యత్ నగరాల ఆవిర్భావానికి వెంకయ్య కృషి చేస్తారనే పూర్తి విశ్వాసాన్ని మోడీ వ్యక్తం చేశారు.