డిఫెన్స్ హబ్గా భారత్, సవాళ్లను ఎదుర్కొంటూనే..: డిఫెన్స్ ఎక్స్పోలో మోడీ
చెన్నై: ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే భారత్ డిఫెన్స్ హబ్(రక్షణ కేంద్రం)గా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత రక్షణ వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆయన గురువారం తమిళనాడు రాజధాని చెన్నై(తిరువిదంతయి)లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో-2018లో పాల్గొని ప్రసంగించారు.
Recommended Video
చెన్నైలో మోడీకి తాకిన కావేరి నిరసన సెగ: 'గో బ్యాక్' నినాదాలు, అరెస్ట్, భారీ భద్రత
గత ప్రభుత్వం రక్షణ వ్యవస్థను నిర్లక్ష్యంగా చేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో దేశ రక్షణ వ్యవస్థను ఎంతో పటిష్టపరిచామని చెప్పారు. దేశ ప్రజలను, భూ భాగాన్ని కాపాడడానికి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నామో.. దేశంలో శాంతి పరిరక్షణకు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నామని మోడీ స్పష్టం చేశారు.
ప్రత్యేకమైనది
మన సాయుధ బలగాలకు తగిన పరికరాలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ స్పష్టంచేశారు. స్వతంత్ర డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రక్షణ శాఖకు సంబంధించిన తయారీ అంశం ప్రభుత్వానికి చాలా ప్రత్యేకమైనదని మోడీ పేర్కొన్నారు.
110 యుద్ధ విమానాలు
తమ అవసరాలను చేరుకునేందుకు 110 కొత్త యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రక్రియ ప్రారంభించామని మోడీ వెల్లడించారు. ‘ఇన్నోవేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సలెన్స్' పథకాన్నిప్రవేశపెట్టామని, దీంతో దేశ వ్యాప్తంగా డిఫెన్స్ ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటవుతాయని తెలిపారు.
ఇది అద్భుతంగా ఉంది..
తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో రెండు డిఫెన్స్ కారిడార్స్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోడీ వెల్లడించారు. నాలుగేళ్లలో తాము 1.3బిలియన్ డాలర్ల విలువ చేసే 794 ఎగుమతి అనుమతులు ఇచ్చామన్నారు. ఎక్స్పోలో 500 భారతీయ కంపెనీలు, 150 విదేశీ కంపెనీలను చూడడం చాలా అద్భుతంగా ఉందని మోడీ అన్నారు.
మంచి పరిణామం
రక్షణ వ్యవస్థకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నామని, పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. డిఫెన్స్ ఎక్స్పోలో 500 భారత్ కంపెనీలు, 150కిపైగా విదేశీ కంపెనీలు పాల్గొనడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అంతేగాక, 40దేశాలు వారి ప్రతినిధులను పంపడం మంచి పరిణామమని అన్నారు.
ఛోళుల నుంచే..
గొప్ప వీరులైన ఛోళులు పాలించిన ఈ భూమి(మహాబలిపురం)కి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఛోళులు విద్యా, వ్యాపార రంగాల్లో ఆ కాలంలోనే ఉన్నతులుగా ఎదిగారని చెప్పారు. వారు మనకు మార్గదర్శకులని అన్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రదర్శించిన యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.