చైనాకు దిమ్మతిరిగే షాక్! ‘వాసెనార్’లోకి భారత్ ఎంట్రీ, ఇక ఈజీగా ‘ఎన్ఎస్జీ’లోకి!?
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి పదే పదే మోకాలడ్డుతోన్న చైనాకు దిమ్మతిరిగే షాక్ లాంటి వార్త ఇది. ‘వాసెనార్ అరేంజ్మెంట్’(డబ్ల్యూఏ)లో భారత్ 42వ సభ్యదేశంగా చేరింది.
న్యూఢిల్లీ: న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి పదే పదే మోకాలడ్డుతోన్న చైనాకు దిమ్మతిరిగే షాక్ లాంటి వార్త ఇది. 'వాసెనార్ అరేంజ్మెంట్'(డబ్ల్యూఏ)లో భారత్ 42వ సభ్యదేశంగా చేరింది.
ఈ అంతర్జాతీయ గ్రూపు.. సంప్రదాయ ఆయుధాలు, డ్యుయల్ యూజ్ టెక్నాలజీలను పొందడం, ఇచ్చిపుచ్చుకోవడాన్ని నియంత్రిస్తోంది. భారత సభ్యత్వానికి ఈ గ్రూపులోని 41 సభ్యదేశాలు మద్దతు ఇచ్చాయి.
ఏమిటీ ‘వాసెనార్ అరెంజ్మెంట్'?
వాసెనార్ అరెంజ్మెంట్ అనేది ఒక అంతర్జాతీయ గ్రూపు. ఈ గ్రూపులో ఇప్పటి వరకు 41 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ గ్రూపులో చేరడం వల్ల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను సముపార్జించుకోవడానికి వీలు కలుగుతుంది.అత్యున్నత స్థాయి టెక్నాలజీని పంచుకునే విషయంలో ఒప్పందాలు చేసుకునేందుకు వీలవుతుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)లో సంతకం పెట్టకుండానే భారత్ ఈ కూటమిలో చోటు దక్కించుకోవడం విశేషం.
ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం...
నిజానికి అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిరినప్పట్నించి భారత్ కొన్ని అంతర్జాతీయ గ్రూపుల్లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వీటిలో ముఖ్యమైనవి.. అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ), క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్), వాసెనార్ అరేంజ్మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్. ఈ కూటములు సంప్రదాయ, అణు, జీవ, రసాయన ఆయుధాలు, వాటి పరిజ్ఞానాలను నియంత్రిస్తుంటాయి.
మోకాలడ్డుతున్న చైనా...
చైనా పైకి ఎంత ప్రేమ ఒలకబోసినా.. దాని మనసులో భారత్ పట్ల విషమే నిండి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాల్లోకి భారత్ను చేరనివ్వకుండా ఎలాగైతే అడ్డుకుంటుందో.. అదేమాదిరిగా అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లోకి కూడా భారత్ ను రానివ్వడం లేదు. ఏదోఒకరోజు భారత్.. తనను మించిపోతుందేమో అనేది చైనా భయం. అందుకే అంతర్జాతీయ యవనికపై మన దేశ ప్రతిష్టకు అది అడ్డుపడుతూనే ఉంటుంది.
వాసెనార్లో చేరికతో ఇదీ ఉపయోగం...
వియెన్నాలో జరిగిన ‘వాసెనార్ అరేంజ్మెంట్' ప్లీనరీ సమావేశం.. భారత్ను 42వ సభ్య దేశంగా ప్రకటించింది. అవసరమైన లాంఛనాలన్నీ పూర్తికాగానే భారత్ ఇప్పటికే ఉన్న సభ్య దేశాల సరసన చేరుతుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు. ఇందులో చేరడం వల్ల అత్యున్నత స్థాయి టెక్నాలజీని పంచుకునే విషయంలో ఒప్పందాలు చేసుకునేందుకు వీలవుతుంది. రక్షణ, అంతరిక్ష రంగాలకు చెందిన కార్యక్రమాల్లో అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం పొందడంలో భారత్కు ప్రయోజనం చేకూరుతుంది. హైటెక్, డ్యుయల్ యూజ్ ఎగుమతుల లైసెన్సుల కోసం భారత్ దరఖాస్తు చేయడం ఇక మరింత తేలిక కానుంది.
ఇక ఈజీగా ఎన్ఎస్జీలోకి...?
భారత్, అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం కుదిరిన తర్వాత మన దేశం నాలుగు నాన్ ప్రొలిఫిరేషన్ (అణ్వస్త్ర రహిత) గ్రూపుల్లో చేరింది. వీటిలోని మూడు గ్రూపుల్లో చైనాకు ఇప్పటి వరకు సభ్యత్వమే లేదు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (ఎంటీసీఆర్)లో సభ్యత్వానికి చైనా దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆ దేశానికి సభ్యత్వం దక్కలేదు. కానీ ఇదే ఎంటీసీఆర్లో భారత్ చేరికకు 31 దేశాలు సమ్మతించాయి. 2016 జూన్ లోనే ఎంటీసీఆర్లో భారత్ సభ్యత్వం పొందింది. ఎంటీసీఆర్, వాసెనార్ సభ్యదేశాల్లో చాలా దేశాలకు అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లోనూ సభ్యత్వం ఉంది. దీంతో ఇక ఈ గ్రూపులో చేరడం భారత్ కు ఈజీగా మారింది. చైనా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఇక భారత్ చేరికను అడ్డుకోలేదు.