India-EU SUMMIT 2020: స్నేహంతోనే శాంతి వర్ధిల్లుతుంది: ప్రధాని నరేంద్ర మోదీ
''ప్రపంచమంతా ఆర్థిక రంగంలో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనే కరోనా రూపంలో మహమ్మారి వచ్చిపడింది. గడిచిన కొద్ది నెలలుగా భారత్ స్వయంగా కరోనాతో పోరాడుతూ, ప్రపంచ దేశాలకు కూడా సహాయకారికగా నిలబడిందని చెప్పడానికి గర్విస్తున్నాను. కరోనా కాలంలో ఇండియా కనీసం 150 దేశాలకు మందులను సరఫరా చేసింది. ఇక్కడి ఫార్మా కంపెనీలు ప్రపంచానికి బాసటగా నిలిచాయంటే అతిశయోక్తికాదు. భూగోళానికి పెనుసవాలుగా పరిణమించిన కరోనాపై మనమంతా ఉమ్మడిగా పోరాడుదాం.. ’’అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
భారత్ - యురోపియన్ యూనియన్(ఈయూ) మధ్య ఇప్పటికే కొనసాగుతున్న బంధాలు.. రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అయ్యేలా ముందుకుపోదామని, అందుకోసం దీర్ఘకాలిక వ్యూహాలు, నిర్మాణాత్మక అజెండాను మనం రూపొందించుకోవాలన్నారు. భారత్-ఈయూ సహజ మిత్రులని, ఇద్దరి లక్ష్యాలు, ఆలోచనలు దగ్గరిగా ఉంటాయని, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి స్నేహం చాలా అవసరమని, ఇవాళ్టి సవాళ్ల కాలంలో అది మరింత ప్రస్పుటంగా అర్థమవుతున్నదని చెప్పారు.
ప్రతిష్టాత్మక భారత్- యురోపియన్ యూనియన్ 15వ సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రసంగించారు. కరోనా విలయం కారణంగా వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి మోదీ నాయకత్వం వహించగా, యురోపియన్ యూనియన్ తరఫున 'యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్' చార్లెస్ మైకెల్, 'యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్' ఉర్సులా వాన్ డెర్ లెయాన్ ప్రాతినిధ్యం వహించారు. నిజానికి ఈ సదస్సు మార్చిలోనే జరగాల్సి ఉన్నా, అనివార్యకారణాల వల్ల రద్దయి, నాలుగు నెలలు ఆలస్యంగా జరిగింది.
సదస్సులో పాల్గొనడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతాలోనూ సంబంధిత అంశాలను ప్రస్తావించారు. ఈ సదస్సు ద్వారా.. 27 దేశాల కూటమి అయిన యురోపియన్ యూనియన్(ఈయూ)తో భారత్ సంబంధాలు ఇంకాస్త బలపడతాయని, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలు మరింత పెరుగుతాయన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
భారత్-ఈయూ చాలా విషయాల్లో సారూప్యంగా ఉంటాయని, అంతర్జాతీయ సంస్థలను గౌరవించడంలో, ప్రజల హక్కుల్ని, కాపాడుకోవడంలో, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోడానికి ప్రాధాన్యం ఇస్తాయని, ఆర్థిక, సాస్కృతిక రంగాల్లో ఇంకాస్త దగ్గర కావడానికి భారత్ సర్వదా సిద్ధంగా ఉంటుందని సదస్సులో ప్రసంగిస్తూ మోదీ చెప్పారు. ఈ సందర్భంగా 'యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్' ఉర్సులా మాట్లాడుతూ.. ''రెండేళ్ల కిందట ఇండియాకు వచ్చినప్పుడు మీ ఆతిథ్యం గుర్తుంది. మళ్లీ మిమ్మల్ని నేరుగా కలవలేకపోతున్నందుకు బాధగా ఉంది. 2022 నాటికి 75వ స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకోబోతున్న భారత్ తన లక్ష్యాలు సాధిస్తుందన్న నమ్మకముంది'' అని అన్నారు. అందుకు ధన్యవాదాలు చెప్పిన మోదీ, ''అవును, కరోనా వల్ల మనం నేరుగా కలవలేకున్నా, వర్చువల్ గానైనా భేటీ కావడం సంతోషం'' అని బదులిచ్చారు.