కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..
అణు బాంబులతో సావాసం చేస్తుంటాడు.. శత్రుదేశాలను ధ్వంసం చేయడానికి తీరొక్క క్షిపణులు తయారు చేశాడు.. కానీ సొంత దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఆదుకునేందుకు ముందుకొచ్చిన వాళ్లనే అనుమానించే రకం కావడంతో మిగతా దేశాలన్నీ అతనికి దూరం పాటిస్తున్నాయి. కానీ భారత్ ఆ పని చేయలేకపోయింది. కష్టసమయంలో ఉత్తరకొరియా పట్ల మానవతా దృక్పథం ప్రదర్శించింది. వెరసి కిమ్ జాంగ్ దేశానికి మోదీ సర్కార్ భారీ వైద్య సహాయాన్ని అందించింది.
కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠ
ఆ వెలుగులు వట్టిదే..
ఉత్తర కొరియాలో కరోనావైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామంటూ దానిని ‘‘వెలిగిపోయే విజయం''గా ప్రకటించుకున్నాడు నియంత నేత కిమ్ జాంగ్. స్కూళ్లను సైతం రీఓపెన్ చేసి, ప్రపంచ దేశాలను ఔరా అనేట్టు వ్యవహరించాడు. కానీ, సరిగ్గా 20 రోజులు తిరిగేలోపే అక్కడ సీన్ రివర్సైంది. రియాలిటీని ఒప్పుకోక తప్పని కిమ్.. తమ దేశంలో కరోనా కేసులున్నాయని ప్రకటిస్తూ, మళ్లీ ఎమర్జెన్సీకి మళ్లాడు. కాగా, కొవిడ్-19కు సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటికే 150 దేశాలకుపైగా మందుల్ని పంపగా.. ఇప్పుడు ఉత్తర కొరియాకు క్షయ వ్యాధి నివారణ కోసం భారీ ఎత్తున సహాయాన్ని అందించింది.
మిలియన్ డాలర్ల విలువైన టీబీ మందులు..
క్షయ వ్యాధి(టీబీ) బాధిత దేశాల జాబితాలో నార్త్ కొరియా ముందు వరుసలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం అక్కడ ఏటా 1.30లక్షలకుపైగా కొత్త టీబీ కేసులు, దాదాపు 20వేల మరణాలు నమోదవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత చైనా ఆధ్వర్యంలో నడుస్తోన్న సప్లై చైన్ దాదాపుగా తెగిపోయింది. దీంతో నార్త్ కు మందులు అందించే విషయమై డబ్ల్యూహెచ్వో భారత్ ను అభ్యర్థించింది. అందుకు సరేనన్న మోదీ సర్కార్.. ప్యోంగ్యాంగ్ లోని భారత ఎంబసీ ద్వారా మిలియన్ డాలర్ల విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ (క్షయ వ్యాధి నివారణ) మందులను అందజేసింది.
హెడ్లైన్స్లో మన రాయబారి..
కమ్యూనిస్టు నియంతృత్వం దేశంగా కొనసాగుతోన్న ఉత్తర కొరియాలో సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్, ఆయన సోదరి కిమ్ యో జాంగ్, అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ముఖ్యనేతల వార్తలు తప్ప అక్కడి అధికారిక మీడియా (కేఎన్కేసీ టీవీ, రొడోంగ్ సిన్మన్ పేపర్)లో ఇతర వార్తలేవీ పెద్దగారావు. అలాంటిది, భారత్ చేసిన వైద్య సహాయంతో ప్యోంగాంగ్ లోని భారత రాయబారి అతుల్ మల్హరి అక్కడ హెడ్ లైన్స్ లో నిలిచారు. ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రాగణంలో.. డబ్ల్యూహెచ్వో ప్రతినిధి సమక్షంలో మల్హరి.. టీబీ నివారణ మందుల్ని ఉత్తర కొరియా అధికారులకు అందజేశారు.
ఇండియా-ఉత్తరకొరియా బంధం..
తన నీడను కూడా అవమానించే కిమ్ జాంగ్ ఉన్.. ఇండియా పట్ల మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే సమయంలో భారత్.. కిమ్ కిరాతక చర్యల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ.. కీలకమైన సమయాన్ని తన వంతుగా సాయం చేస్తూ వస్తున్నది. గతంలో నార్త్ ను సునామీ ముంచెత్తిన సందర్భంలో 30వేల డాలర్ల ఆర్థిక సహాయాన్ని భారత్ ప్రకటించింది. తర్వాతి కాలంలో నార్త్ విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటించి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేశారో మన రాష్ట్రపతికి వివరించారు. ఉత్తరకొరియాకు చైనా తర్వాత ఇండియానే అతి పెద్ద స్నేహితుడిగా ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు దాటింది.
Recommended Video
చైనాతో విభేదాల సమయంలో..
తూర్పు లదాక్ సహా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి డ్రాగన్ దేశంతో విభేదాలు కొనసాగుతోన్న తరుణంలో చైనాకు ఆప్తురాలైన ఉత్తరకొరియాకు భారత్ భారీ ఎత్తున వైద్య సహాయం అందించడం మన విదేశాంగ విధానంలోని వైవిధ్యతకు రుజువుగా నిలిచింది. కిమ్ దేశంతో దౌత్య సంబంధాలు వద్దని అమెరికా ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ భారత్ తన పంథాలోనే పయనిస్తున్నది. మరీ ప్రధానంగా బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే నార్త్ కొరియాకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు జరగడం గమనార్హం. 1998లో(వాజపేయి హయాంలో) తొలిసారి ఉత్తరకొరియాలోని భారత రాయబార కార్యాలయానికి ఐఎఫ్ఎస్ స్థాయి అధికారిని నియమించగా, 2018లో కేంద్ర మంత్రి వీకే సింగ్ ఉత్తరకొరియాలో అధికారికంగా పర్యటించారు.