విపత్కర సమయంలో ఆదుకుంటున్న "గివ్ ఇండియా": కోవిడ్ బాధితులకు మీవంతు సహాయం చేయండి..!
ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తోంది. ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లడంతో ఎంతో మంది నిరుపేదల ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కావడంతో తినేందుకు ఆహారం దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ముందుకొస్తున్నాయి. వారిని ఆదుకునేందుకు తమవంతు సహాయం చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి గివ్ ఇండియా.
ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్డౌన్ మోడ్లోకి వెళ్లిపోవడంతో ఆదేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నాయి. దేశ సరిహద్దులు మూసివేయడంతో వాణిజ్యంతో పాటు వ్యాపారాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఇక ఇప్పుడిప్పుడే భారత్లో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలామందికి ఉద్యోగాలు లేక పనులు లేక వారి జీవనం కష్టతరంగా మారింది. పనులు లేక రోజువారీ కూలీల పరిస్థితి దుర్బరంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు పస్తులతో పడుకుంటున్నాయి. అలాంటి వారిని ఆదుకునేందుకు కొన్ని ఎన్జీఓ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే గివ్ ఇండియా అనే ఎన్జీఓ సంస్థ ముందుకొచ్చింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఈ విపత్తుతో అల్లాడిపోతున్న కుటుంబాలను ఆదుకుంటోంది.
ఇక వీరిని ఆదుకునేందుకు వారికి వివిధ రూపాల్లో సహాయం అందజేయడం జరుగుతోంది. ఒకటి నగదు నేరుగా బాధిత కుటుంబాల చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఇది జరగాలంటే మీ సహాయం కూడా కావాలి. కరోనావైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకు బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే అంతా చేయి చేయి కలిపి వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని గివ్ ఇండియా సంస్థ భావిస్తోంది. దాతలు ఇచ్చే విరాళాలతో ప్రాణాలను నిలుపుదామని పిలుపునిస్తోంది.
ముందుగా గివ్ ఇండియా కోవిడ్-19 బాధిత కుటుంబాలను గుర్తిస్తుంది. ఇదంతా తమ పార్ట్నర్స్ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది. అంతేకాదు ఆదార్ నెంబర్ వివరాల ద్వారా రేషన్ కార్డు ఉందాలేదా అనేది ముందుగా నిర్థారణ చేసుకుంటుంది. ఇక నిర్థారణ జరిగిన తర్వాతే అలాంటి కుటుంబాలకు నగదు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు పరిశుభ్రత పాటించేలా శానిటరీ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ప్రారంభించిన మూడు రోజుల్లో, గివ్ ఇండియా 6,000 మందికి పైగా దాతల నుండి 1.5 కోట్లకు పైగా విరాళాలను సేకరించింది, నిరుపేదలకు పారిశుద్ధ్య వస్తు సామగ్రిని అందించింది. గివ్ ఇండియా ద్వారా విరాళాలు ఇచ్చేవారికి పన్ను మినహాయింపు ఉంటుంది. దాతలు ఆన్లైన్ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చని గివ్ ఇండియా సంస్థ పేర్కొంది.