అటు కరోనా వార్ .. ఇటు ఉగ్రవాదులతో వార్ .. జై జవాన్ !!
కరోనా పై భారతదేశం సమరం సాగిస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా సాగిస్తున్న సమరం మెరుగైన ఫలితాలను ఇస్తుంది అనే చెప్పాలి . ఇక ఇదే సమయంలో భారత సైన్యం భారత్ లోకి చొరబడాలని, దాడులు చెయ్యాలని భావిస్తున్న ఉగ్రమూకలపై కూడా యుద్ధం చేస్తుంది. జై జవాన్ అన్న పదానికి అర్ధం చెప్తూ భారత దేశ సైన్యం ఒకే సమయంలో రెండు పోరాటాలు చేస్తుంది.
కరోనాతో ముంచుకొస్తున్న ఉపద్రవం ... ప్రపంచానికి తీవ్ర ఆహార సంక్షోభం !!
ఓ వైపు ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాటం సాగిస్తున్న సమయంలో మన భారత సైన్యం మాత్రం కరోనాతో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పోరాటం సాగించాల్సి వస్తుంది. గత వారం రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా వారికి చెక్ పెడుతూ భారత సైన్యం సత్తా చూపిస్తుంది. జమ్ముకశ్మీర్లోని కుల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడ్డారని ఇటీవల వారిని పట్టుకున్న భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది . మరికొందరు ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపు చేస్తున్నాయి. ఇక తాజాగా జమ్ముకశ్మీర్లోని బారాముల్ల, సోపోర్ ప్రాంతాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది.
సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టి ఉగ్రవాదులను గుర్తించారు . ఇక భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగటంతో ఎదురుకాల్పులకు దిగిన సైన్యం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ సాజద్ దార్ ను హతమార్చారు . అతని మృతదేహం వద్ద ఏకే 47 రైఫిల్, మూడు మ్యాగజైన్స్, 59 రౌండ్ల బుల్లెట్లు దొరికినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఒకవైపు దేశం మొత్తం కరోనా పై పోరాటం చేస్తున్న సమయంలో లాక్ డౌన్ లో భాగంగా ప్రజల ఆరోగ్య రక్షణకు కావలి కాస్తూనే దేశాన్ని ఉగ్ర మూక బారి నుండి కాపాడుతున్న జవాన్లకు సెల్యూట్ చేస్తుంది భరతజాతి .