ఆ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ఫోన్లు.. నిమిషానికి ఛార్జ్ ఎంతో తెలుసా...?
ఉత్తరాఖండ్ : చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని భారత్కు చెందిన గ్రామాలకు శాటిలైట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైనా భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి సరిహద్దు జిల్లాల్లోని గ్రామాలను అప్రమత్తం చేశాయి. ఇందులో భాగంగానే ఆయా గ్రామ సర్పంచ్లకు శాటిలైట్ ఫోన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దు గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేనందున శాటిలైట్ ఫోన్లు ఇవ్వాలని భావిస్తోంది.
చైనా స్వరాలకు నేపాల్ తోకజాడింపు.. భారత్పై విషం కక్కిన ప్రధాని ఓలి.. భూఆక్రమణకు శపథం..
సరిహద్దు ప్రాంతం కావడం, కొండ ప్రాంతం కావడంతో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లేదా ఇతర నెట్వర్క్లు అక్కడ టెలిఫోన్ టవర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో సరిహద్దు గ్రామాల వారు చాలామంది నేపాల్కు చెందిన సిమ్ కార్డులను వినియోగిస్తున్నారు. అందుకే ఆ గ్రామ పెద్దలకు శాటిలైట్ ఫోన్లు అందజేస్తున్నట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తెలిపింది.
ఇక నేపాల్ చైనాలతో దాదాపు 49 గ్రామాలు సరిహద్దుల్లో ఉన్నాయని చెప్పిన పితోర్గడ్ కలెక్టర్ విజయ్ కుమార్ జోగ్దాండే... ఇందులో 34 గ్రామాలు దార్చులా తాలూకాలో ఉండగా మిగతావి మున్శ్యారీ తాలూకాలో ఉ్ననాయి. మొత్తం 19 శాటిలైట్ ఫోన్లు గ్రామ సర్పంచ్లకు ఇచ్చామని వెల్లడించారు. మిగతాగ్రామాలకు కూడా త్వరలోనే శాటిలైట్ ఫోన్లు అందజేస్తామని వివరించారు. ఇక 15 గ్రామాల్లోని గ్రామ పెద్దలకు శాటిలైట్ ఫోన్లు ఆదివారం నాటికి అందిస్తామని చెప్పిన కలెక్టర్... అందుకు నిమిషానికి రూ.12 వసూలు చేస్తామని అదే సమయంలో ఒక ఎస్ఎంఎస్కు కూడా రూ. 12 ఛార్జ్ చేస్తామని చెప్పారు.
ఇక అంతర్జాతీయ కాల్స్ చేస్తే నిమిషానికి రూ. 260 ఛార్జ్ చేస్తామని చెప్పారు. తమ గ్రామ ప్రజలు ఫోన్లు మాట్లాడాలంటే సరైన కనెక్టివిటీ లేదని శాటిలైట్ ఫోన్లు వస్తే వాటితో తమ బంధువులతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నామని కొందరు గ్రామస్తులు చెప్పారు. తన గ్రామంలో చాలామంది నేపాల్ సిమ్ కార్డులను వినియోగిస్తున్నారని.. ఖర్చు కాస్త ఎక్కువైన ఫర్వాలేదని భారతీయ ఫోన్లనే వినియోగిస్తానని సాలు దాటల్ అనే వ్యక్తి చెప్పాడు. ఇదిలా ఉంటే శాటిలైట్ ఫోన్ ఛార్జీలు కాస్త తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.