పెట్టుబడులకు మంచి గమ్యస్థానం భారత్: సౌదీలో మోడీ ప్రసంగం, సౌదీ సంస్థ గ్రీన్ సిగ్నల్
రియాద్: భారతదేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ సౌదీకి చెందిన సంస్థలకు పిలుపునిచ్చారు. భారత్ ఇందుకు మంచి గమ్యస్థానమని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు.
5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్..
సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. రియాద్లో జరిగిన భవిష్యత్ పెట్టుబడుల ప్రారంభ సదస్సు(ఎఫ్ఐఐ) 2019లో పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఐదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని అన్నారు. మౌలిక వసతుల రంగంలోనూ భారత్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు.
ర్యాంకులు మెరుగయ్యాయి..
ఒక్క ఈ రంగంలోనే వచ్చే ఐదేళ్లలో 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న విధానాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్నోవేషన్ ఇండెక్స్, లాజిస్టిక్ ఫర్ఫార్మెన్స్లో తమకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్లను ఆయన ప్రస్తావించారు.
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
అంతేగాక, దేశంలోని 400 మిలియన్ల యువతకు వచ్చే మూడు నాలుగేళ్లలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. 2024 నాటికి చమురు రిఫైనింగ్, పైపు లైన్లు, గ్యాస్ టెర్మినల్స్ తదితర రంగాల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్నామని వివరించారు.
ముందుకొచ్చిన సౌదీ సంస్థ
సౌదీకి చెందిన ఆరామ్కో సంస్థ వెస్ట్కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుుకు ప్రధాని సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. ఈ రిఫైనరీ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దదని మోడీ వెల్లడించారు. కాగా, సౌదీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి అక్కడి మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా, మంత్రులు ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్, అహ్మద్ బిన్ సులేమాన్ అల్రజీ, అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ మెహసేన్ అల్ ఫద్లే తదితరులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.