భారత్లో ప్రతి ఒక్క నిర్థారిత కరోనా కేసుతో 90 మందికి సోకిన ఇన్ఫెక్షన్:
సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో ఏర్పాటు కాబడిన ఓ ప్యానెల్ కరోనావైరస్ పరీక్షలపై సంచలన ప్రకటన చేసింది. ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు గుర్తిస్తే 90 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించడంలో విఫలమయ్యారని ఓ పరిశోధన ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 2021 నాటికల్లా దేశం కరోనావైరస్ నుంచి విముక్తి చెందుతుందని చెప్పిన కమిటీ కూడా ఇదే కావడం విశేషం.
ఇక కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించడంలో ఒక మేథమ్యాటికల్ మోడల్ను అనుసరించినట్లు చెప్పిన సభ్యులు... కొన్ని అంచనాలను తీసుకుని దేశ జనాభాతో పునఃసమీక్షించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా దేశంలోని 60శాతం మంది ప్రజలు కరోనా బారిన పడగా వారిలో యాంటీబాడీస్ కూడా డెవలప్ అయినట్లు నిర్థారించారు. ఈ మోడల్ ప్రకారం ఇటలీ, యూకే లాంటి దేశాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. అంతేకాదు ఆదేశాల్లో మరణ రేటు కూడా భారత్తో పోలిస్తే అధికంగా ఉందని వెల్లడించారు.
నిష్పత్తి ప్రకారం చూస్తే భారత్లో ఒకరు మృతి చెందితే ఇటలీ దేశంలో 10 మంది చనిపోతుండగా అదే యూకేలో 15 మంది మృతి చెందుతున్నారని స్టడీ పేర్కొంది. ఇక భారత్లో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని అయితే వారికి కరోనా సోకి ఉంటుందని చెప్పారు. అంటే సగటున ఒకరిలో కరోనా లక్షణాలు కనిపిస్తే 90 మందిలో లక్షణాలు కనిపించకుండా కరోనా సోకినవారే అని చెబుతున్నారు.
ఉదాహరణకు ఢిల్లీ కేరళలను తీసుకుంటే ఒక కరోనా కేసు బయటపడితే... 25 మందికి ఇన్ఫెక్షన్ సోకుతోందని అయితే వారిలో లక్షణాలు కనిపించడం లేదని తమ పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రారంభమైన తొలినాళ్లలో ఢిల్లీలో ఒక కేసు నిర్ధారణ అయితే 43 మందికి వ్యాధి సోకేదని చెప్పారు. ఈ నిష్పత్తి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వేరుగా ఉంటుందని దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదని కూడా చెబుతున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఒక నిర్ధారిత కేసు వస్తే అక్కడ 300 మందికి సోకేదని అయితే వారిలో లక్షణాలు కనిపించేవి కాదని శాస్త్రవేత్తలు వివరించారు. ఇదిలా ఉంటే ఈ పరిశోధనలన్నీ ఇంకా ప్రచురితం కావాల్సి ఉంది.