కరోనాపై సరికొత్త అస్త్రం: భారత్లో క్లినికల్ ట్రయల్స్: ఫస్ట్ టైమ్: జపాన్ మెడిసిన్తో
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను కకావికలం చేస్తోన్న కరోనా వైరస్ను నిర్మూలించడానికి భారత్లో త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ఆరంభం కాబోతున్నాయి. కరోనా వైరస్ను అంతమొందించడానికి ప్రపంచదేశాలేవీ ఇప్పటిదాకా ఎలాంటి డ్రగ్ను గానీ, మెడిసిన్ గానీ కనిపెట్టలేకపోతున్నాయి. రెమెడిసివిర్ అందుబాటులో ఉందంటూ ఇదివరకు వార్తలు వెలువడినప్పటికీ.. అది ప్రాణం మీదికి వచ్చిన సందర్భాల్లోనే వినియోగించాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ డ్రగ్ను మరింత అభివృద్ధి చేసే పనిలో పడ్డారు.
అదే సమయంలో మరో సరికొత్త డ్రగ్ తెరమీదికి వచ్చింది. అదే ఫ్యావిపిరవిర్ (Favipiravir). దీన్ని కరోనా వైరస్ను నిర్మూలించడానికి వినియోగించడానికి భారత్ సిద్ధపడుతోంది. ఇందులో భాగంగా- ఈ మెడిసిన్తో క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించడానికి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ శేఖర్ మందె తెలిపారు.
ఇదివరకు కరోనా వైరస్ చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తాయని భావించిన హైడ్రాక్సిక్లొరొక్విన్ గానీ, రెమ్డెసివిర్ గానీ ఆశించిన స్థాయిలో ఫలితాలను చూపట్లేదని భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఫ్యావిపివిర్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ డ్రగ్ జపాన్, చైనాలో చాలాకాలం నుంచే విస్తృతంగా వినియోగంలో ఉందని అన్నారు. ఈ రెండు దేశాల్లో ఇన్ఫ్లుయెన్జాను నియంత్రించడానికి దాన్ని వినియోగిస్తున్నారని అన్నారు. ఈ ఫ్యావిపిరవిర్తోనే మనదేశంలో కరోనా వైరస్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని శేఖర్ మందె చెప్పారు.