అనాలిసిస్ : అతిపెద్ద వాణిజ్య ఒప్పందం నుంచి భారత ఎందుకు తప్పుకుంది..?
న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్సెప్)నుంచి భారత్ వైదొలిగిన విషయం తెలిసిందే. వాణిజ్య రంగంలో పాశ్చాత్య దేశాలకు ఆసియాలోని ప్రాంతీయ దేశాలు తమ సత్తా చాటాలని చైనా ప్రతిపాదించింది. అయితే చైనా ఒత్తిడి మేరకు పలు ప్రతిపాదనలు సదస్సు సందర్భంగా తెరపైకి వచ్చాయి. కానీ భారత్ మాత్రం ఆ ప్రతిపాదనలకు అంగీకారం తెలపలేదు. ఇదే విషయం భారత ప్రధాని నరేంద్ర మోడీ సదస్సులో చెప్పారు.
భారతీయులకు నష్టం కలిగించే పనులను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. మొత్తం 16 దేశాలు ఉన్న ఈ కూటమిలో భారత్ పక్కకు రావడంతో 15 దేశాలపై చైనా ఆధితపత్యం ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా చైనా విజయం సాధించినప్పటికీ భారత్కు మాత్రం ఆ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి.
భారత్ పసిఫిక్ దేశాల వాణిజ్యంపై ప్రభావం
ఆర్సెప్ నుంచి వైదొలగాలని భారత్ తీసుకున్న నిర్ణయం కఠినాత్మకమైనప్పటికీ దేశ వాణిజ్య అవసరాల దృష్ట్యా తీసుకోక తప్పలేదు. భారత్ బయటకు రావడంతో ఆశాదృక్పథ సంకేతాలను పంపింది. ఒకవేళ ఆర్సెప్లో భారత్ భాగస్వామి అయితే భారత్ పసఫిక్ దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత్ బయటకు రావడంతో ఇండో పసిఫిక్ దేశాలతో వాణిజ్య సంబంధాలు మరితం బలపడి భవిష్యత్తుల్లో పెట్టుబడుల వెల్లువ ఉండే అవకాశం ఉంది.
వేరుగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు
ఇక భారత్ ఆసియా ఖండంలోని పలు ముఖ్య దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతుంది. ఈ సందర్భంగా స్వేచ్ఛగా వాణిజ్య ఒప్పందాలు ఆ దేశాలతో కుదుర్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆసియా దేశాలు కాకుండా ఇతర దేశాలు అయిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో కూడా వేరుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇండోనేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా, జపాన్ సింగపూర్ లాంటి దేశాలు భారత్కు ముఖ్య వాణిజ్య భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇదే సమయంలో ఇతర ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
భారత్ వైదొలగడం చాలా దేశాలకు ఇష్టం లేదు
ఇదిలా ఉంటే ఆర్సెప్ నుంచి భారత్ వైదొలగడం తమకు ఎంత మాత్రం ఇష్టం లేదని పలు దేశాధినేతలు చెప్పారు. స్వయంగా జపాన్ ప్రధాని షింజో అబే భారత్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మోడీని కోరారు. ఒకవేళ భారత్ తప్పుకుంటే చైనా ఆధిపత్యం ఎక్కువ అవుతుందనే భావనలో ఆర్సెప్ కూటమిలోని దేశాలు భావిస్తున్నాయి. గత ఏడేళ్లుగా ఆర్సెప్ సదస్సుల్లో భారత్ పాల్గొంటూ వస్తోంది. అనేక చర్చల్లో పాల్గొంది. కానీ ఒక్కసారిగా భారత్ బయటకు రావాలన్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేసింది. ఎందుకంటే ఈ ఏడేళ్ల కాలంలో మార్కెట్లలోకానీ వాణిజ్యరంగంలో కానీ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పడు భారత్ ఆర్సెప్ పెట్టిన నిబంధనలకు లోబడితే చాలా నష్టపోతుందనే అభిప్రాయం ప్రధాని మోడీ వ్యక్తం చేశారు.
చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశం
ఇదిలా ఉంటే భారత్ ఒకవేళ ఆర్సెప్ కూటమిలో కొనసాగి ఉంటే తీవ్రంగా నష్టపోయేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆర్సెప్ కూటమిలోని దేశాల మధ్య జరిగే ఒప్పందంలో వస్తువులపై దిగుమతి సుంకాలు దాదాపు 90 శాతం తగ్గించాలనే నిబంధన చేరుస్తున్నారు. ఇదే జరిగితే చైనా వస్తువులకు భారత్లో మంచి మార్కెట్ ఉంది. ఒకవేళ ఈ ఒప్పందంకు భారత్ అంగీకరిస్తే 90శాతం దిగుమతి సుంకం ఎత్తివేయాల్సి ఉంటుంది. అది భారత్కు చాలా నష్టం చేకూరుస్తుంది. ఇలాంటి ఒప్పందాలు చాలా వరకు చైనా ప్రతిపాదించింది.